Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 11 Jun 2024 13:11 IST

1. కూటమి శాసనసభా పక్ష భేటీ.. ఏకగ్రీవంగా చంద్రబాబు ఎన్నిక

తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్‌ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పూర్తి కథనం.

2. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ ఎన్నిక

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. పవన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పూర్తి కథనం.

3. మోదీ క్యాబినెట్‌లో స్థానం దక్కని వేళ.... శరద్‌ పవార్‌కు అజిత్‌ కృతజ్ఞతలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) వర్గానికి షాక్‌ ఇచ్చాయి. ఎన్సీపీ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ ఫలితాలతో తన బాబాయి, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) వర్గంపై తన వైఖరి మారినట్లు కన్పిస్తోంది.  పూర్తి కథనం.

4. జలపాతంలో పడి.. కర్ణాటకలో హైదరాబాద్‌ యువకుడు మృతి

స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ హైదరాబాద్‌ యువకుడి (Hyderabad youth dies) కథ విషాదాంతమైంది. కర్ణాటకలోని (Karnataka) ఓ జలపాతం వద్ద ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి కథనం.

5. ఇజ్రాయెల్ సైన్యం దూసుకొస్తే.. బందీలను కాల్చివేయండి

గాజాలో ఉద్ధృత పోరు కొనసాగుతోంది. ఇటీవల హమాస్‌ చెరలో ఉన్న నలుగురు బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌ నిర్వహించిన ఆపరేషన్లలో స్థానికంగా భారీగా ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హమాస్‌ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టెల్‌అవీవ్ దళాలు ముందుకు చొచ్చుకొని వస్తున్నాయని భావిస్తే..బందీలను కాల్చివేయాలని తమ దళాలకు అగ్రనేతల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. పూర్తి కథనం.

6. జూన్ 18న వారణాసికి ప్రధాని మోదీ..రైతులతో సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి (Varanasi)కి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ ఆయన  ‘కిసాన్ సమ్మేళన్’ (రైతుల సదస్సు)లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపాయి. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి.  పూర్తి కథనం.

7. ఆ బౌండరీ ఇచ్చి ఉంటే.. దక్షిణాఫ్రికా-బంగ్లా మ్యాచ్‌లో DRS వివాదం

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024)లో బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్‌ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో  స్వల్ప స్కోరును కాపాడుకున్న సఫారీ జట్టు.. బంగ్లాదేశ్‌పై కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇందులో (BAN vs SA) ఓ డీఆర్‌ఎస్‌ నిర్ణయం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. దాని కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పోగా.. సరిగ్గా ఆ నాలుగు పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాకు విజయం దక్కడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. పూర్తి కథనం.

8. ‘ప్రత్యేక కుర్చీ వద్దు’.. కూటమి సమావేశంలో చంద్రబాబు సంస్కారం

తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) వేదికపై ఆసీనులయ్యారు. వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీని సిద్ధం చేయగా ఆయన తిరస్కరించారు. పూర్తి కథనం.

9. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ అధ్యయనం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోన్న పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో అధ్యయనం చేసిన ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. కాబోయే సీఎం చంద్రబాబుని కలిసి ఆయన సూచనల మేరకు వీలైనంత త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి కథనం.

10. ఏపీలో పింఛన్ల పెంపుపై అధికారుల కసరత్తు

పింఛన్ల పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పింఛన్ జులై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు చెప్పినందున అధికారులు వివరాల సేకరణ పనిలో పడ్డారు. పూర్తి కథనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని