Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 May 2023 17:08 IST

1. తెలంగాణలో రాగల 3రోజులు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్‌: మంత్రి హరీశ్‌రావు

వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డిలో రూ.15 కోట్లతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం గండిమాసానిపేట్‌లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్‌ తనదైన ముద్రవేశారు: మోదీ

శక పురుషుడు నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 101వ ‘మన్‌ కీ బాత్‌’ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ప్రధాని..  శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాలతో పాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ధోనీ అంటే కేవలం లీడర్‌ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్‌’

ఐపీఎల్‌ ఫైనల్‌(IPL 2023 Final) నేడే. ఐదోసారి టైటిల్‌పై కన్నేసిన చెన్నై(chennai super kings)..   గుజరాత్‌(Gujarat Titans)తో తలపడనుంది. ఈసారి విజేతగా నిలిచి.. ముంబయి రికార్డును సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు  సీఎస్కే సారథి ధోనీ(MS Dhoni)కిదే చివరి సీజన్‌ అంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. అభిమానులు తమదైన శైలిలో ప్రత్యేక సందేశాలు పెడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. దిల్లీలో ఉద్రిక్తత!

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం వేళ అటు వైపు మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు నిర్బంధించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారు: రాహుల్‌ గాంధీ

నూతన పార్లమెంట్‌ భవన (new Parliament building) ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. పార్లమెంట్‌.. ప్రజల గళమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన కాసేపటికే రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రారంభోత్సవ వేడుకలను కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇది 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం.. : కొత్త పార్లమెంట్‌లో ప్రధాని మోదీ

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్వీకర్‌ ఓంబిర్లాతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌, ఎంపీలు, పలువురు సీఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ప్రసంగం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం

రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై అమెరికా  శ్వేతసౌధం, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు  సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ విషయాన్ని ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్థి ధ్రువీకరించారు. దివాలా అంచుకు చేరిన అమెరికాకు ఈ ఒప్పందంతో కాస్త ఊరట లభించినట్లైంది. శనివారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, మెకార్థి మధ్య ఫోన్‌కాల్‌లో చర్చలు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బోయింగ్‌, ఎయిర్‌బస్‌కు పోటీగా చైనా ప్యాసింజర్‌ విమానం..!

చైనాలో దేశీయంగా తయారు చేసిన భారీ ప్రయాణికుల విమానం సీ919 తొలిసారి ఆదివారం గాల్లోకి ఎగిరింది. ఇది షాంఘై నుంచి బీజింగ్‌కు ప్రయాణించినట్లు అక్కడి ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ షినూవా పేర్కొంది. చైనాకు చెందిన ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ ఎంయూ9191గా రిజిస్టరైంది. ఉదయం 10.32కు షాంఘై నుంచి బయల్దేరిన ఈ విమానం మధ్యాహ్నాం 12.31కు బీజింగ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈసారి మా గేమ్‌ ప్లాన్‌ మాత్రం అలా ఉండదు: చెన్నై సూపర్ కింగ్స్‌ కోచ్‌

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ సీజన్‌ విజేతను తేల్చే పోరు కోసం చెన్నైసూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ సిద్ధమవుతున్నాయి. సీఎస్‌కే జట్టులో ధోనీ ప్రధాన ఆకర్షణ కాగా.. గుజరాత్‌లో మాత్రం సెంచరీల హీరో శుభ్‌మన్‌ గిల్‌దే  హవా. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్నాడు. అతడిని అడ్డుకోవడంపైనే సీఎస్‌కే  విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు