Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 14 May 2023 21:06 IST

1. ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ.. చేసిన అభివృద్ధి శాశ్వతం: చంద్రబాబు

ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, తాను చేసిన అభివృద్ధి శాశ్వతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్‌ ఆఫ్ పబ్లిక్‌ పాలసీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25ఏళ్ల క్రితం విజన్‌ 2020 ప్రకటించినప్పుడు కొందరు విజన్‌ 420 అని అవహేళన చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భానుడి ఉగ్రరూపం.. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు

తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. దీంతో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో గరిష్ఠంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాతృదినోత్సవం రోజున దారుణం.. పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

నగరంలోని మీర్‌పేటలో మాతృదినోత్సవం రోజే దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను చంపి ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. విక్కీ (18 నెలలు), లక్కీ (8నెలలు)ని నీళ్ల తొట్టిలో ముంచేసి ఆ తర్వాత తల్లి భారతి (25) విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మాతృదినోత్సవం రోజున ఈ ఘటన జరగడం పలువురి హృదయాల్ని కలచివేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కర్ణాటక సీఎల్పీ భేటీ.. సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ వీడేనా?

కర్ణాటక(Karnataka)లో విజయం సాధించిన కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసేందుకు సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది. సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తమ ప్రయత్నాలు మరింత ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. తమకు విధేయులైన ఎమ్మెల్యేలతో సిద్ధూ, డీకేఎస్‌ విడివిడిగా సమావేశం కావడం ఉత్కంఠ రేపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆయనతో విభేదాల్లేవ్‌.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశా: డీకే శివకుమార్‌

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్యతో (Siddaramaiah) తనకు ఎలాంటి విభేదాలు లేవని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shiva kumar)స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగాలు చేసి, సిద్ధ రామయ్య తరఫున నిలిచానని అన్నారు. 135 స్థానాల్లో విజయం సాధించి..ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌.. సీఎంగా ఎవరిని నియమించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమ్మా.. నాకు శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు: ఆనంద్‌ మహీంద్రా

మాతృదినోత్సవం (Mother's Day) సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తమ మాతృమూర్తులను గుర్తుచేసుకుంటూ.. సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. వారితో కలిసివున్న ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజస్థాన్‌ ఆలౌట్.. బెంగళూరు సూపర్‌ విక్టరీ

ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు విజృంభించారు. దీంతో రాజస్థాన్‌పై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్‌ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!

ఆఫీస్‌లో పని ఒత్తిడిగా అనిపిస్తే..  చాల మంది ఉద్యోగులు క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగుతుంటారు. మరికొంతమంది మాత్రం సాయంత్రం ఆఫీస్‌ అయ్యాక.. పబ్‌, బార్‌కో వెళ్లి రిలాక్స్‌ అవుతుంటారు. ఇకపై ఆఫీస్‌ అయ్యేదాకా ఎదురుచూడాల్సిన అవసరంలేదు. క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగినట్లు.. ఆ రాష్ట్రంలో క్యాంటీన్‌కు వెళ్లి బీర్‌ తాగొచ్చు. ఎక్కడంటారా? హరియాణాలో. ఈ మేరకు హరియాణా ప్రభుత్వం కార్పొరేట్‌ ఉద్యోగులు ఆఫీస్‌లోనే మద్యం సేవించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తిరుపతి ‘వందే భారత్‌’ వేళల్లో మార్పు.. 16 బోగీలతో రైలు ఎప్పట్నుంచంటే?

సికింద్రాబాద్‌-తిరుపతి నగరాల మధ్య సేవలందిస్తోన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) రైలుకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తోన్న ఈ సెమీ-హైస్పీడ్‌ రైలులో బోగీల సంఖ్యను రెట్టింపు చేసిన రైల్వే బోర్డు.. తాజాగా ఆ రైలు వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. అలాగే, ప్రయాణికుల అభ్యర్థన మేరకు పెంచిన 16 బోగీలతో ఈ రైలు మే 17 నుంచే పరుగులు పెట్టనుందట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డగౌట్‌పై దాడి కాదు.. ఆటగాళ్లపైనే విసిరారు: జాంటీ రోడ్స్‌

ఉప్పల్‌ వేదికగా శనివారం రాత్రి హైదరాబాద్ - లఖ్‌నవూ (SRH vs LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేక్షకుల్లోని కొందరు తాము కూర్చున్న సీట్‌ నట్టులు, బోల్టులను తీసి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ డగౌట్‌పై విసరడంతో మ్యాచ్‌ను ఆరు నిమిషాలపాటు నిలిపివేయాల్సి వచ్చిందని సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని