Hyderabad: మాతృదినోత్సవం రోజున దారుణం.. పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

మాతృదినోత్సవం రోజున ఓ తల్లి తన ఇద్దరి పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేటలో ఆదివారం జరిగింది.

Updated : 14 May 2023 20:32 IST

హైదరాబాద్‌: నగరంలోని మీర్‌పేటలో మాతృదినోత్సవం రోజే దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను చంపి ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. విక్కీ (18 నెలలు), లక్కీ (8నెలలు)ని నీళ్ల తొట్టిలో ముంచేసి ఆ తర్వాత తల్లి భారతి (25) విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మాతృదినోత్సవం రోజున ఈ ఘటన జరగడం పలువురి హృదయాల్ని కలచివేసింది.

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని కుబ్యా తండాకు చెందిన శ్రీనివాస్‌, భారతి దంపతులకు 2020లో వివాహమైంది. ప్రస్తుతం వీరు మీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలోని జిల్లెలగూడ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు విక్కీ, లక్కీ ఉన్నారు. దంపతుల మధ్య శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గొడవ జరిగింది. ఆదివారం ఉదయం కూడా మరోసారి గొడవపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీనివాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో భారతి టబ్‌లో నీళ్లు నింపి తన ఇద్దరు పిల్లల్ని అందులో పడేసింది. అనంతరం ఆమె విషం తాగి ఆత్యహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. వెంటనే శ్రీనివాస్‌ ఇంటికి వచ్చి పిల్లలను దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భారతిని ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఏసీపీ పురుషోత్తం, ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని