Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Mar 2023 09:10 IST

1. త్వరలో ఈపీఎఫ్‌ వడ్డీరేటు ఖరారు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2022-23 ఏడాదికి భవిష్యనిధి నిల్వలపై వడ్డీరేటును త్వరలో నిర్ణయించనుంది. ఈనెల 27, 28 తేదీల్లో జరిగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ (సీబీటీ)ల సమావేశంలో ఈ విషయాన్ని ఎజెండాగా చేర్చింది. 2021-22 ఏడాదికి వడ్డీరేటు 8.10 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి అంతే ఉంటుందా? ఏమైనా మార్పులు జరగనున్నాయా అనేది ఆ రోజు తెలుస్తుంది. ఈపీఎఫ్‌వో వార్షిక నివేదిక, నిల్వలు, లోటు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని వడ్డీరేటును ఖరారు చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అయిదేళ్ల బాలుడికి కానిస్టేబుల్‌ ఉద్యోగం!

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సర్గుజా జిల్లాకు చెందిన నమాన్‌ రాజ్‌వాడే అనే అయిదేళ్ల యూకేజీ విద్యార్థి పోలీస్‌ కానిస్టేబులుగా ఇటీవల నియామక పత్రం స్వీకరించాడు. ఈ బాలుడి తండ్రి రాజ్‌కుమార్‌ రాజ్‌వాడే స్థానిక మహిళా పోలీస్‌స్టేషనులో కానిస్టేబుల్‌గా పని చేసేవారు. విధుల నిర్వహణ క్రమంలో కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. పోలీస్‌శాఖ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద నమాన్‌ రాజ్‌ వాడే నియామకానికి నిర్ణయం తీసుకున్నట్లు సర్గుజా జిల్లా ఎస్పీ భావనా గుప్తా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గాలి మారింది!

జిల్లా వైకాపాకు కంచుకోట అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడప తర్వాత.. ఆ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చేది కూడా ఇక్కడే. 2019లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలను కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. అలాంటిది.. ప్రస్తుతం వైకాపా పతనానికి నాందీ కూడా నెల్లూరు నుంచే ప్రారంభమైందని సొంత పార్టీ నాయకులే పేర్కొంటుండటం గమనార్హం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని కొందరు అసహనంతో ఉండగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్‌కు వరమా.. శాపమా?

 దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటం, ఆ వెంటనే లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తాజా పరిణామాలు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా ప్రస్తుతం కనిపిస్తున్నప్పటికీ ఆ పార్టీకి, రాహుల్‌కు అంతిమంగా లబ్ధి కలిగిస్తాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజకీయంగానే కాకుండా న్యాయ పోరాటానికీ సిద్ధంకావాల్సిన అనివార్య పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడిందని, దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో వచ్చే కదలిక సంస్థాగతంగా బలోపేతం కావడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘షాపూర్‌జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’

రాజధాని ప్రాంతంలో రూ.7 వేల కోట్ల విలువైన పనులు చేసిన షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి నుంచి తెదేపా అధినేత చంద్రబాబు రూ.143 కోట్లు వసూలు చేశారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. 5 శాతం కమీషన్‌ కింద ఈ మొత్తం వసూలు చేశారని పేర్కొన్నారు. షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌, చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌లపై ఆదాయపు పన్ను శాఖ చేసిన సోదాల్లో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆదాయ పన్ను చెల్లింపుదార్లకు ఊరట

 కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం కొంత ఊరట కల్పిస్తూ ఆర్థిక బిల్లు 2023లో సవరణలు చేసింది. బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం పన్ను వర్తించే ఆదాయం రూ.7 లక్షల వరకూ ఉన్నప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆదాయం రూ. 100 అధికంగా ఉన్నా అంటే.. రూ.7,00,100 ఉన్నా ఆ వ్యక్తి రూ.25,010 వరకూ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తొలగిస్తూ కొత్త సవరణ తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అందగత్తె ముందు.. మెదడు గోవిందా!

 అందమైన అమ్మాయి కనపడగానే కుర్రాళ్ల ఒంట్లో ఏదేదో జరిగిపోవడం కామన్‌. తను ఓ ఓరచూపు విసిరిందా.. ఇక అంతే. మాటలు తడబడతాయి. మెలికలు తిరిగిపోతుంటారు. ఇంతేనా.. ఆ సమయంలో అసలు మగాళ్లకు కొద్దిసేపు మెదడు పని చేయడమే మానేస్తుందట. ఇదేదో మేం ఆషామాషీగా చెబుతోంది కాదండోయ్‌.. నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలిన వాస్తవం ఇది. ఈ వివరాల్ని ‘ఎక్స్‌పెరిమెంటల్‌ అండ్‌ సోషల్‌ సైకాలజీ’ అనే జర్నల్‌లో ఈమధ్యే ప్రచురించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎల్బీనగర్‌లో నేటి నుంచి రయ్‌ రయ్‌..

 ఎల్బీనగర్‌లో శనివారం సాయంత్రం నుంచి మరో పైవంతెన అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం- దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ కూడలి వద్ద నిర్మించిన పైవంతెనను మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎల్బీనగర్‌ కూడలిని సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు  రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వివరాలను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఖగోళంలో వింత... చంద్రుడితో శుక్ర గ్రహణం

ఆకాశంలో శుక్రవారం రెండు అరుదైన ఘటనలు చోటుచేసుకున్నట్లు ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ఎన్‌.శ్రీరఘునందన్‌ తెలిపారు. ‘చంద్రునితో శుక్ర గ్రహణం, శుక్రునితో చంద్ర సంయోగం జరిగాయి. ఇవి సూర్యాస్తమయానికి ముందే జరగడంతో మనకు కనిపించలేదు. ఈ శుక్రగ్రహణం సాయంత్రం 4:45 గంటలకు మొదలై 5.30 గంటలకు ముగిసింది. లద్దాక్‌లోని అన్‌లే అబ్జర్వేటరీలో శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలించారు. రాష్ట్రంలో చాలాచోట్ల రాత్రివేళ ఆకాశంలో చూసినప్పుడు మాత్రం చంద్రుడి కింది భాగంలో చుక్క కనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గురుకులం టు వైట్‌హౌస్‌

ప్రతిభకు ఎల్లలుండవని రుజువు చేసింది బాపట్ల గురుకులం విద్యార్థిని అక్ష. పేద కుటుంబానికి చెందిన బాలిక చదువులో ప్రతిభ చూపి ఏకంగా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కించుకుంది. బాపట్ల గురుకులంలో చదివే విద్యార్థిని ప్రస్తుతం అమెరికాలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. తరగతి గదిలో చలాకీగా ఉంటూ కష్టపడి చదువుతూ తాజాగా అమెరికా అధ్యక్ష భవన కార్యాలయం వైట్హౌస్‌ నుంచి ఆహ్వానం అందుకుని సందర్శించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని