మా రాకెట్‌తో ముప్పు ఉండకపోవచ్చు

చైనా రాకెట్‌తో ప్రపంచానికి ముప్పు ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఆ దేశం తొలిసారి ఈ విషయంపై మౌనం వీడింది. రాకెట్‌ శకలాలు భూమిని తాకే లోపల..

Published : 08 May 2021 05:51 IST

చైనా వెల్లడి

బీజింగ్‌: చైనా రాకెట్‌తో ప్రపంచానికి ముప్పు ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఆ దేశం తొలిసారి ఈ విషయంపై మౌనం వీడింది. రాకెట్‌ శకలాలు భూమిని తాకే లోపల.. వాతావరణంలోనే కాలిపోతాయని శుక్రవారం పేర్కొంది. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని తెలిపింది. చైనా గతవారం ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్‌ శకలాలు ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు భయాందోళనలకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇంతవరకు పెద్దగా పట్టనట్లు వ్యవహరించిన చైనా.. తొలిసారి స్పందించింది. రాకెట్‌ శకలాలు భూమిని తాకే లోపలే అవి కాలిపోతాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని పేర్కొన్నారు. లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ ఏప్రిల్‌ 29న స్వీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ప్రధాన మాడ్యూల్‌ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి, ఆ తర్వాత నియంత్రణ కోల్పోయిందన్నారు. ఇప్పుడు భూమివైపు దూసుకొస్తోందని తెలిపారు. అయితే, రాకెట్‌ భూ వాతావరణంలోకి ప్రవేశించాక కాలిపోతుందని పేర్కొన్నారు. భూమిపై పడి నష్టం కలిగించడం అనేది దాదాపు జరగకపోవచ్చని చెప్పారు. శకలాలు ఎక్కడ పడొచ్చు? వాటిపై సంబంధిత దేశాలను ముందే హెచ్చరించారా? అన్న ప్రశ్నలకు.. ‘‘మా అధికారులు ఎప్పటికప్పుడు దీనిపై వివరాలు అందిస్తారు’’ అని పేర్కొన్నారు. రాకెట్‌ శకలాలను నిశితంగా గమనిస్తున్నామని వివరించారు. చైనాకు చెందిన పలువురు నిపుణులు మాత్రం ఆ శకలాలు అంతర్జాతీయ జలాల్లో పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని