icon icon icon
icon icon icon

Lok sabha Elections: కొనసాగుతోన్న రెండో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

Lok sabha Elections: లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 26 Apr 2024 11:06 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) రెండో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా..పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గతేడాది తీవ్రస్థాయి ఘర్షణలతో ఉక్కిరిబిక్కిరి అయిన మణిపుర్‌లోని పలు పోలింగ్ బూత్‌ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. (Lok sabha Elections)  

తొలిగంటల్లో ఓటేసిన ప్రముఖులు వీరే.. 

  • అలప్పుళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఓటేశారు. 
  • మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే బెంగళూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
  • కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బెంగళూరులోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్‌ లైన్‌లో నిల్చొని ఓటేశారు. 
  • మీరు నమ్మిన వ్యక్తిని ఎంచుకోవడం ముఖ్యమని, అందుకోసం ప్రతి ఒక్కరు పోలింగ్‌లో పాల్గొనాలని ఓటేసిన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్ అన్నారు.
  • భాజపా బెంగళూరు సౌత్‌ అభ్యర్థి తేజస్వీ సూర్య, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి, కేంద్రమంత్రి, బెంగళూరు నార్త్‌ అభ్యర్థి శోభా కరంద్లాజె, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్ష వర్ధన్‌ శింగ్లా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్ కుటుంబం, పశ్చిమ్‌ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్‌ బోస్‌, కేంద్రమంత్రి, జోధ్‌పుర్ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్, భాజపా తిస్సూర్‌, పథనంథిట్ట అభ్యర్థులు సురేశ్‌ గోపి, అనిల్ ఆంటోనీ ఓటు వేశారు. ‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ బిహార్‌లో, మలయాళీ నటుడు టొవినో థామస్ కేరళలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు..

కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో నేడు ఓటింగ్‌ పూర్తికానుంది. రాజస్థాన్‌లో మొత్తం స్థానాలు 25 ఉండగా.. 12 స్థానాలకు తొలి దశలో పోలింగ్‌ ముగిసింది. రెండో దశలో మిగతా స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. కర్ణాటక 14, ఉత్తర్‌ప్రదేశ్‌ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్‌ 6, బిహార్‌ 5, అస్సాం 5, పశ్చిమ బెంగాల్‌ 3, ఛత్తీస్‌గఢ్‌ 3, జమ్మూకశ్మీర్‌ 1, మణిపుర్‌ 1, త్రిపుర 1 స్థానాల్లో నేడు పోలింగ్‌ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img