Pratiksha tondwalkar: 35 ఏళ్ల క్రితం స్వీపర్‌.. ఇప్పుడు అదే బ్యాంకుకు ఏజీఎం

ఒకప్పుడు స్వీపర్‌గా పనిచేసిన బ్యాంకులోనే అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగి.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రతీక్షా టోండ్‌వల్కర్బ్‌57్శ. పుణెలోని ఓ పేద కుటుంబంలో ఆమె జన్మించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏడో

Updated : 09 Aug 2022 10:14 IST

స్ఫూర్తిమంతం టోండ్‌వల్కర్‌ ప్రస్థానం

ముంబయి: ఒకప్పుడు స్వీపర్‌గా పనిచేసిన బ్యాంకులోనే అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగి.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రతీక్షా టోండ్‌వల్కర్‌ (57). పుణెలోని ఓ పేద కుటుంబంలో ఆమె జన్మించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏడో తరగతితోనే చదువు ఆపేశారు. 17 ఏళ్లకే..1981లో పెద్దలు పెళ్లి చేసేశారు. ప్రతీక్ష భర్త.. సదాశివ్‌ కడు ముంబయి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో బుక్‌ బైండర్‌గా పనిచేసేవారు. కొంతకాలానికి వారికి కుమారుడు పుట్టాడు. పసిబిడ్డతో కలిసి సొంతూరు వెళ్లి గ్రామదేవతకు మొక్కు తీర్చుకోవాలని అనుకున్నారు కొత్త దంపతులు. దురదృష్టవశాత్తూ అప్పుడు జరిగిన ప్రమాదంలో సదాశివ్‌ మరణించారు. ఫలితంగా ప్రతీక్ష 20ఏళ్ల వయసుకే భర్తను కోల్పోయి.. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలారు.

ఉద్యోగం చేద్దామంటే ప్రతీక్ష పెద్దగా చదువుకోలేదు. అందుకే ఎస్‌బీఐ అధికారులు ఆమెకు స్వీపర్‌ పని ఇచ్చారు. రోజూ ఆమె ఉదయం 2 గంటలపాటు బ్యాంకుకు వచ్చి.. అక్కడి గదులన్నీ శుభ్రం చేసేవారు. అందుకు అప్పట్లో ఆమెకు ఇచ్చిన జీతం నెలకు రూ.60-65 మాత్రమే. మిగిలిన సమయంలో వేరే చోట్ల పని చేస్తూ కుమారుడ్ని చూసుకునేవారు. అంతటితో ఆమె ఆగిపోలేదు. మళ్లీ చదువుపై దృష్టిపెట్టారు. కష్టపడి పదో తరగతి పూర్తి చేశారు. తర్వాత ముంబయి ఎస్‌ఎన్‌డీటీ కళాశాలలో చేరి డిగ్రీ చదివారు. కామర్స్‌లో ఉత్తీర్ణులై బ్యాంకులో క్లర్క్‌గా చేరారు. బ్యాంక్‌లో మెసెంజర్‌గా పనిచేసే ప్రమోద్‌ టోండ్‌వల్కర్‌తో 1993లో ప్రతీక్ష కొత్త జీవితం ప్రారంభించారు. ఆయన ప్రోత్సాహంతో బ్యాంకు ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌ రాసి.. ట్రైనీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. నిబద్ధత, నిజాయతీ, పరిశ్రమతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అంచెలంచెలుగా ఎదిగి.. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి చేరారు. ప్రస్తుతం బాంద్రాలోని ఎస్‌బీఐలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. కొద్ది నెలల్లోనే పదవీ విరమణ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని