రాత్రికి రాత్రే 50వేల మందిని వెళ్లగొట్టలేరు.. ఉత్తరాఖండ్‌ మెగా కూల్చివేతలపై సుప్రీం స్టే

ఉత్తరాఖండ్‌లో రైల్వే శాఖకు చెందిన భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దశాబ్దాలుగా అక్కడ ఉంటున్న వారిని ఖాళీ చేయించే పద్ధతి ఇది కాదని స్పష్టం చేసింది.

Updated : 05 Jan 2023 14:54 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని హల్ద్వానీ కూల్చివేతల అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. రైల్వే భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఇలాంటి కేసుల్లో మానవీయ కోణాన్ని కూడా చూడాలని.. రాత్రికి రాత్రే 50వేల మందిని వెళ్లగొట్టకూడదని స్పష్టం చేసింది.

హల్ద్వానీ (Haldwani)లోని బన్‌భూల్‌పురా ప్రాంతంలో 29 ఎకరాల భూమి తమదేనని రైల్వేశాఖ గతేడాది కోర్టుకెక్కింది. ఈ విశాల స్థలంలో స్థానికులంతా అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని, వారిని ఖాళీ చేయించాలంటూ ఉత్తరాఖండ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ స్థలంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ గతేడాది డిసెంబరు 20న తీర్పు వెలువరించింది. దీనిపై వారం రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని, ఆ తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టాలని ఆదేశించింది.

రైల్వేశాఖ (Railways) పేర్కొంటున్న స్థలంలో 4,365 కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ నాలుగు వేలకు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. హైకోర్టు తీర్పుతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు.. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన జస్టిస్‌ ఎస్‌.కె. కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌ ఓకా ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

‘‘ఈ కేసు మానవీయ కోణంతో ముడిపడి ఉంది. కొన్ని దశాబ్దాలుగా వారంతా అక్కడే ఉంటున్నారు. 1947 తర్వాత కొంత మంది ఈ స్థలాన్ని వేలంలో దక్కించుకుని అక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు. 60-70 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నవారిని ఖాళీ చేయించే పద్ధతి ఇది కాదు. ఇలాంటి ఉత్తర్వులను మేం ప్రోత్సహించబోం. వారికి తప్పనిసరిగా పునరావాసం కల్పించాలి. భూమిపై ఎలాంటి హక్కులు లేనివారికి కూడా పునరావాసం కల్పించే ఖాళీ చేయించిన సందర్భాలున్నాయి. బాధితులను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించాలి. ఇందులో మొత్తం భూమి రైల్వే శాఖదేనా? ప్రభుత్వానికి ఏమైనా స్థలం ఉందా? అన్న విషయాలపై స్పష్టత ఉండాలి. అంతేగానీ, 50వేల మందిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించలేరు’’ అని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని