Cinema News: ‘ఉస్తాద్‌’లో స్నేహితుల ఆట

ఇన్నేళ్ల సినీ చరిత్రలో తను పాల్గొన్న బెస్ట్‌ షో ‘ఉస్తాద్‌’ అని అంటున్నారు కథానాయకుడు సందీప్‌ కిషన్‌. ఆయన..ఆది పినిశెట్టి కలిసి ఈ రియాలిటీ గేమ్‌ షోలో ఇటీవలే పాల్గొని సందడి చేశారు.

Updated : 28 Jan 2024 11:59 IST

ఇన్నేళ్ల సినీ చరిత్రలో తను పాల్గొన్న బెస్ట్‌ షో ‘ఉస్తాద్‌’ అని అంటున్నారు కథానాయకుడు సందీప్‌ కిషన్‌. ఆయన..ఆది పినిశెట్టి కలిసి ఈ రియాలిటీ గేమ్‌ షోలో ఇటీవలే పాల్గొని సందడి చేశారు. హీరో మంచు మనోజ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తమ అభిమానుల కోసం సినీతారలు ఆడే ఈ ఆట మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. మంచి స్నేహితులైన మనోజ్‌, సందీప్‌, ఆది చేసిన అల్లరితో ఎపిసోడ్‌ అద్భుతంగా సాగింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉంది. తమ అభిమాని కోసం వారిద్దరూ కలిసి ర్యాంప్‌ ఆడించారా లేదా తెలియాలంటే ఈ ఎపిసోడ్‌ తప్పక చూడాల్సిందే.


యువతతో పాటు కుటుంబం మెచ్చే సినిమా

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, మేఘలేఖ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వంలో రానున్న ప్రేమకథా చిత్రమిది. బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. నలుగురి జీవితంలోని స్నేహం, ప్రేమ..అన్ని భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘నేటి యువతరాన్ని ఆకట్టుకునే ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో కుటుంబాన్ని మెప్పించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా యువతకు ఓ పండగలా ఉంటుంది’ అని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ఆర్‌.ఆర్‌ ధ్రువన్‌, వసంత్‌.జి


బహుముఖ నటుడు

హర్షివ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. గుడ్‌, బ్యాడ్‌ అండ్‌ యాక్టర్‌.. అన్నది ఉపశీర్షిక. స్వర్ణిమా సింగ్‌, మరియా మార్టినోవా కథానాయికలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. దాంట్లో హర్షివ్‌ ముఖం సగం దైవ స్వరూపంలా.. మరో సగం మామూలు కుర్రాడి తరహాలో ఆసక్తికరంగా కనిపించింది. ‘‘ఇదొక వినూత్నమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌. అట్లాంటా, కాంటన్‌, జార్జియా, యుఎస్‌ఏ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: ఫణి కల్యాణ్‌, ఛాయాగ్రహణం: ల్యూక్‌ ప్లెచర్‌.


శాపం పొందిన కుర్రాడు ప్రేమలో పడితే!

ద్యంతం వినోదాత్మకంగా సాగే రొమాంటిక్‌ డ్రామా చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా కుటుంబ సమేతంగా చూడగలిగేలా ఉంటుంది’’ అన్నారు కౌశిక్‌ భీమిడి. ఆయన దర్శకత్వంలో యష్‌ పూరి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యోగేష్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. అపూర్వ రావ్‌ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు కౌశిక్‌.

  • ‘‘మా చిత్ర ఆరంభంలోనే హీరోకున్న శాపాన్ని చెప్పేస్తాం. అక్కడి నుంచి కథ ఎన్ని మలుపులు తిరిగిందన్నది వినోదాత్మకంగా చూపించాం. ముగింపులో హీరో శాప విముక్తి పొందడంతో కథ సుఖాంతమవుతుంది. దీంట్లో యష్‌, అపూర్వ అద్భుతమైన నటనను కనబరిచారు. వాళ్లిద్దరి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా ఓ క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నా’’.

  • ‘‘నేను మహాభారతం చదువుతున్నప్పుడు దాంట్లోని చాలా శాపాల గురించి తెలిసింది. వాటిలోని ఓ శాపాన్ని ఈతరం కుర్రాడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ‘హ్యాపీ ఎండింగ్‌’ కథకు శ్రీకారం చుట్టా. ఇదొక భిన్నమైన రొమాంటిక్‌ డ్రామా సినిమా. దీంట్లో హీరోకి ఒక శాపం ఉంటుంది. అది తనకు ట్రాజెడీ అయినా చూసే ప్రేక్షకులకు వినోదాత్మకంగా ఉంటుంది. చిన్నప్పుడే బాబా శాపం పొందిన ఆ కుర్రాడు ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడన్నది ఆసక్తికరంగా చూపించాం’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని