ఎన్నారైలపై జగన్ కక్ష సాధింపును ఖండించిన జయరాం కోమటి

ప్రవాసాంధ్రుల పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఎన్నారై తెదేపా యూఎస్‌ఏ కోఆర్డినేటర్  జయరాం కోమటి అన్నారు. 

Published : 02 Jan 2023 13:14 IST

ప్రవాసాంధ్రుల పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఎన్నారై తెదేపా యూఎస్‌ఏ కోఆర్డినేటర్  జయరాం కోమటి అన్నారు. అమెరికాలోని బే ఏరియాలో పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

‘‘రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం సాయం చేయకపోగా.. తమవంతు సాయం చేసే వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నగారి జనత వస్త్రాల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా పంపిణీ జరుగుతుందని తెలిసి కూడా పోలీసులు బందోబస్తు సక్రమంగా చేయలేదు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యాల కారణంగా జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించడం విచారకరం. జరిగిన సంఘటన పట్ల మా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం. వీరి మరణానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డే బాధ్యత వహించాలి. ఇటీవల చంద్రబాబు పాల్గొంటున్న అనేక బహిరంగ సభలకు ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. కానీ అందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేయడం లేదు. ప్రవాసాంధ్రుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు బనాయించడం ద్వారా భవిష్యత్తులో ఎవరూ సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై కేసులు పెట్టాల్సింది పోయి.. మంచి మనసుతో పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన  ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ దుర్ఘటనలో మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ , తెలుగుదేశం పార్టీ వారు కుటుంబానికి సుమారు రూ.30 లక్షల సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం మాత్రం సక్రమంగా స్పందించకుండా అరకొర సాయం చేసింది. ఇప్పటికైనా మరణించిన వారి కుటుంబాలను ఆదుకుని ఉయ్యూరు శ్రీనివాసరావుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి’ అని జయరాం కోమటి డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని