లండన్‌లో సీబీఈ అవార్డు అందుకున్న తెలుగు బిడ్డ డా.కన్నెగంటి చంద్ర

నిజామాబాద్‌ జిల్లాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్ర ప్రతిష్ఠాత్మక  ‘కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (సీబీఈ)’ పురస్కారాన్ని అందుకొన్నారు.

Updated : 23 Mar 2024 18:58 IST

లండన్‌: బ్రిటన్‌లో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ‘కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (సీబీఈ)’ అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని తెలుగుబిడ్డ కన్నెగంటి చంద్ర అందుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారతీయ వైద్యుడైన ఆయన వైద్యరంగంలో చేసిన విశేష సేవలకు గాను 2023 ఏడాదికి ఈ పురస్కారాన్ని ప్రకటించగా.. తాజాగా ఆయన ప్రిన్సెస్‌ రాయల్‌ చేతులమీదుగా అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడిన వారిలో ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి చంద్ర కావడం విశేషం.

ఈ సందర్భంగా కన్నెగంటి చంద్ర మాట్లాడుతూ.. విండ్సర్ ప్యాలెస్‌లో ప్రిన్సెస్‌ రాయల్‌ నుంచి సీబీఈ పురస్కారాన్ని అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. దీన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్టోక్-ఆన్-ట్రెంట్ ప్రజలు తనకు జనరల్‌ ప్రాక్టిషనర్‌గా సేవ చేసే అవకాశం కల్పించినందుకు వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

నిజామాబాద్‌ జిల్లా కోటగిరికి చెందిన దామోదర్‌రావు- సరోజిని దంపతుల కుమారుడైన కన్నెగంటి చంద్ర జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మారం గ్రామంలో జన్మించారు. స్థానిక నిర్మల్‌లో రెండో తరగతి, ఆ తర్వాత ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లో విద్యనభ్యసించారు. అనంతరం గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 2002లో లండన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జనరల్‌ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూ.. ఆ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం బ్రిటన్‌లో వైద్యుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. బ్రిటీష్‌ ఇండియన్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (BIDA)కు నేషనల్‌ ఛైర్మన్‌గానూ పని చేశారు. కొవిడ్‌ మహమ్మారి అతలాకుతలం చేస్తున్న తరుణంలో ఈ అసోసియేషన్‌ భారత్‌కు ఆక్సిజన్‌ సరఫరా కోసం రూ.50లక్షల మేర సమీకరించి అందజేయడంలో ఆయన కృషి ఉంది. చంద్ర బ్రిటన్‌లో స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగరంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గానూ పని చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఆయనకు వచ్చిన ఆదరణ చూసి అక్కడ ఈ ఏడాదిలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ (సెంట్రల్‌) నుంచి చేయడానికి అవకాశం ఇచ్చింది. ఆ దేశ ప్రధాని రిషిసునాక్‌తోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని