ప్రజాస్వామ్య రక్షణే జైపాల్‌రెడ్డికి నిజమైన నివాళి

పార్లమెంటరీ విలువలకు పట్టంగట్టిన నేత జైపాల్‌రెడ్డి అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా మాడ్గులలో శుక్రవారం ముఖ్య అతిథిగా ఏచూరి ఆవిష్కరించారు.

Published : 01 Oct 2022 04:43 IST

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

మాడ్గుల, న్యూస్‌టుడే: పార్లమెంటరీ విలువలకు పట్టంగట్టిన నేత జైపాల్‌రెడ్డి అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా మాడ్గులలో శుక్రవారం ముఖ్య అతిథిగా ఏచూరి ఆవిష్కరించారు. అనంతరం వాసవి ఫంక్షన్‌ హాలులో పీసీసీ మాజీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. ఆయన స్ఫూర్తితో ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పారు. సమానత్వం, మానవతావాదం ఆయన సిద్ధాంతమన్నారు. అందుకోసమే జీవితమంతా పనిచేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతినబూనుదామని అదే జైపాల్‌రెడ్డికి నిజమైన నివాళి అని ఏచూరి పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మెట్రో రైలు ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెడతామన్నారు. ఈ ప్రాజెక్టును, రూ.1500 కోట్ల నిధులను ఆయనే మంజూరు చేయించారన్నారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రసంగిస్తూ.. పార్లమెంటు ఆవరణలో జైపాల్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకమని గుర్తుచేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని, హైదరాబాద్‌ ట్యాంకు బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటుచేయాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి కోరారు. రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య.. నిరుపేదల, పేద విద్యార్థుల పక్షపాతిగా జైపాల్‌రెడ్డిని కీర్తించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. విగ్రహాలు యువతకు ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ పి.రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గ్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని