
Revanth reddy: కేసీఆర్, ఈటల మధ్య విభేదాలకు కారణమిదే: రేవంత్రెడ్డి
ఇల్లందకుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
‘‘ఎస్ఆర్ఎస్పీ ప్రాజక్టు ద్వారా సాగునీరందించి ఈ ప్రాంత రైతులను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టినా.. అని కేసీఆర్ చెబుతున్నారు. కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనన్న కేసీఆర్కు ఎందుకు ఓటు వేయాలి. రైతులు పండించిన పంటను కొనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ధాన్యం కొనలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? కాళేశ్వరం పేరుమీద రూ.లక్షన్నర కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో రూ.30వేల కోట్లు సంపాదించుకున్నారు. అ డబ్బుతో హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్హౌస్లు కట్టుకున్నారు. 57 ఏళ్లు నిండిన వారికి పింఛను ఇస్తామని కేసీఆర్ చెప్పారు.. కానీ 65 ఏళ్లు దాటిన వారికీ పింఛను రాలేదు. కొత్త పింఛన్లు మంజూరు చేయట్లేదు, పండించిన వరిని క్వింటా రూ.2వేలకు కొనుగోలు చేయడం లేదు.. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అని రేవంత్రెడ్డి ఆరోపించారు.
హరీశ్..ఈటల ఇద్దరూ ఒక్కటే..
భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్, మంత్రి హరీశ్రావు ఇద్దరూ ఒక్కటేనని రేవంత్రెడ్డి విమర్శించారు. ఈటల, హరీశ్రావు కలిసి కేసీఆర్ను పొగడలేదా అని ప్రశ్నించారు. దేవుడి మాన్యాల పంపకాల్లోనే కేసీఆర్, ఈటలకు మధ్య విభేదాలు వచ్చాయన్నారు. అక్రమ సంపాదన వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని ఆరోపించారు. వేషం మార్చినంత మాత్రాన ఈటల రాజేందర్ ఇవాళ ఉత్తముడు కాదని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి
Advertisement