‘ఇన్స్పైర్’.. విజేతలకు ఉచితంగా బీటెక్ సీట్లు
మీ పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలైన ఇన్స్పైర్, హ్యాక్థాన్, కిషోర్ వైజ్ఞానిక ప్రోత్సాహన్ యోజన, నాసా కాంటెస్ట్ వంటి వాటిల్లో ప్రతిభ చూపారా? అయితే వారు జేఈఈ మెయిన్, ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాయకున్నా..
ఎంసెట్, జేఈఈలలో ర్యాంకు రాకున్నా సరే..
సూపర్ న్యూమరరీ కింద ఒక్కో కళాశాలలో 2 సీట్లు
మార్గదర్శకాలు జారీ చేసిన ఏఐసీటీఈ
ఈనాడు, హైదరాబాద్: మీ పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలైన ఇన్స్పైర్, హ్యాక్థాన్, కిషోర్ వైజ్ఞానిక ప్రోత్సాహన్ యోజన, నాసా కాంటెస్ట్ వంటి వాటిల్లో ప్రతిభ చూపారా? అయితే వారు జేఈఈ మెయిన్, ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాయకున్నా.. రాసినా ర్యాంకు రాకున్నా ఉన్నత ప్రమాణాలున్న కళాశాలల్లో బీటెక్లో చేరొచ్చు. అంతేకాదు వారు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
చదువులో ర్యాంకులు సాధించని ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తుంటారు. సమస్యలను లోతుగా అర్థం చేసుకొని వినూత్న పరిష్కారాలకు రూపం ఇచ్చి పరికరాలు, యంత్రాలు తయారు చేస్తుంటారు. అలాంటి ప్రతిభావంతులకు (గిఫ్టెడ్ చిల్డ్రన్)కు ఒక్కో కళాశాలల్లో 2 సీట్లు కేటాయిస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది. ఆమేరకు మార్గదర్శకాలు జారీచేసింది.
త్వరలో కళాశాలల ఎంపిక..
విద్యాసంస్థ పనితీరు, కేంద్ర విద్యాశాఖ ఇచ్చే జాతీయ ర్యాంకింగ్(ఎన్ఐఆర్ఎఫ్), ఏఐసీటీఈ అటల్ ర్యాంకింగ్తోపాటు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు తదితర కొలమానాల ఆధారంగా ఈ సీట్లు కేటాయించాల్సిన కళాశాలలను త్వరలో ఎంపిక చేస్తామని ఏఐసీటీఈ పేర్కొంది.
ప్రస్తుతానికి ఏఐసీటీఈ గుర్తించిన పోటీలు ఇవీ...
* రాష్ట్ర, జాతీయ స్థాయి హ్యాకథాన్
* సీఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు
* ఇన్స్పైర్ అవార్డు
* ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ పురస్కారం
* కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)
* గూగుల్ సైన్స్ ఫెయిర్
* అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్
* ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్- ధ్రువ్
* నాసా రోవర్ ఛాలెంజ్
* ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ ఫెయిర్
* వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ ఇండియా
* ఫస్ట్ లెగో లీగ్ ఇండియా
* ఫస్ట్ టెక్ ఛాలెంజ్
* ఫస్ట్ రోబోటిక్స్ కాంపిటీషన్
* ఇండియన్ రోబో కప్ జూనియర్
* నేషనల్ సైన్స్ కాంకర్స్
* ఎన్ఎస్ఎస్, నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్
* ఇమేజిన్ కప్ (మైక్రోసాఫ్ట్)
* రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఒలింపియాడ్
* ఇన్నోవేటివ్ స్టార్టప్ అవార్డ్
ఎవరు అర్హులు..
* ప్రభుత్వ, ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతలు.
* కేంద్ర సైన్స్- టెక్నాలజీ విభాగం(డీఎస్టీ), బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ), సీఎస్ఐఆర్, ఎన్సీఈఆర్టీ, కేంద్ర విద్యాశాఖ, డీఆర్డీఓల నుంచి ప్రాజెక్టులకు నిధులు పొందిన వారు.
* గుర్తింపు పొందిన బహుళ జాతి, స్వచ్ఛంద సంస్థల (గూగుల్, బెల్ ల్యాబ్స్, ఇంటెల్, టీసీఎస్, ఐబీఎం, టెస్లా, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, లాక్హీడ్ మార్టిన్, స్టెమ్ తదితర) నుంచి నిధులు పొందిన వారు.
* యూజీసీ గుర్తించిన కేర్-2 జర్నళ్లలో పరిశోధన పత్రాలు ప్రచురితమైన వారు
* జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లు పొందిన వారు.
ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి...
* ఆయా విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం, ఇతరులు 45 శాతంతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
* ఇంజినీరింగ్ చదవాలన్న ఆసక్తి ఉండటంతోపాటు తనకు సీటు కేటాయించాలని కళాశాలకు దరఖాస్తు చేసుకోవాలి. నిపుణుల కమిటీ ముఖాముఖికి హాజరుకావాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు