లీకైంది ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం

ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

Published : 14 Mar 2023 05:16 IST

పోలీసుల దర్యాప్తులో వెల్లడి
భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలవీ తస్కరించినట్లు అనుమానం
ఏఈ పరీక్ష రద్దుపై నేడు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. తొలుత ఈ నెల 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు కంప్యూటర్‌ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలోని సమాచారం ఆధారంగా పలువురు వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌, గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. కాగా, ఏఈ పరీక్షపై అధికారులు మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు.

ఫోరెన్సిక్‌ నివేదిక వస్తే..

నియామక పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రెండు నెలల ముందుగానే సిద్ధమవుతుంది. ప్రశ్నపత్రాలన్నింటినీ సాఫ్ట్‌కాపీ రూపంలో భద్రపరుస్తారు. ప్రశ్నల పక్కనే వాటి జవాబులుంటాయి. అసిస్టెంట్‌ ఇంజినీరు ప్రశ్నపత్రాన్ని తస్కరించే క్రమంలో కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోని ప్రశ్నపత్రాల ఫోల్డర్‌ను నిందితులు డౌన్‌లోడ్‌ చేశారు. ఇందులో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలకు సంబంధించినవీ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో కాపీ చేసి భద్రపరిచిన హార్డ్‌ డిస్క్‌, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గతంలో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలూ లీక్‌ అయ్యాయా? అన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఫోల్డర్‌ను ఫిబ్రవరి 25 లేదా 28న డౌన్‌లోడ్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పోలీసులు పంపించారు. ఆ నివేదిక వస్తే మరిన్ని విషయాలు బయటపడనున్నాయి. ఏ రోజు ఫోల్డర్‌ను ఎప్పుడు డౌన్‌లోడ్‌ చేశారన్న ఆధారాలు లభిస్తే మరింత స్పష్టత రానుంది.

బలహీనంగా నెట్‌వర్క్‌

కంప్యూటర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన ఫోల్డర్‌లో భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఉన్నట్లు బయటపడటంతో వాటి స్థానంలో కొత్త ప్రశ్నపత్రాలను కమిషన్‌ సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు కొంత సమయం తీసుకునే అవకాశాలున్నాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్ల నెట్‌వర్క్‌ బలహీనంగా ఉందని పోలీసు దర్యాప్తులో తేలిందని తెలిసింది. సరైన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక సర్వర్‌ లేకపోవడంతో కంప్యూటర్లను నిందితులు తేలికగా హ్యాక్‌ చేసినట్లు వెల్లడైంది.

* అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు జరిగిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు బయటపడటంతో టీఎస్‌పీఎస్సీ మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుంది. పరీక్షను రద్దు చేయాలా? లేదా ఇద్దరికే లీక్‌ అయిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై న్యాయనిపుణుల సలహాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలనూ రద్దు చేసినట్లు స్పష్టంచేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని