టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు (టీఎస్‌పీఎస్సీకి) ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మన్‌తో పాటు మరో అయిదుగురు సభ్యులున్నారు.

Published : 26 Jan 2024 05:32 IST

సభ్యులుగా మరో అయిదుగురు
కొత్త బోర్డు ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు (టీఎస్‌పీఎస్సీకి) ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మన్‌తో పాటు మరో అయిదుగురు సభ్యులున్నారు. ఛైర్మన్‌గా విశ్రాంత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి అనితా రాజేంద్ర, విశ్రాంత పోస్టల్‌ సర్వీసు అధికారి ప్రొఫెసర్‌ అమీరుల్లా ఖాన్‌, జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ నర్రి యాదయ్య, జెన్‌కో ఈడీ యరబాడి రామ మోహనరావు, మాజీ మున్సిపల్‌ కమిషనర్‌ పాల్వాయి రజినీకుమారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించిన బి.జనార్దన్‌రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మహేందర్‌రెడ్డి, సభ్యులుగా అయిదుగురి పేర్లను ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసైకి ప్రతిపాదించింది. పరిశీలించిన ఆమె వాటిని ఆమోదించారు. ఈ మేరకు వారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌తో పాటు సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. ఆలోగా 62 ఏళ్లు పూర్తయితే పదవీ కాలం ముగుస్తుంది.


ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి

పుట్టిన తేదీ: 3-12-1962
స్వస్థలం: కిష్టాపురం, ఖమ్మంజిల్లా
విద్యార్హత: ఎంటెక్‌ (ఐఐటీ, దిల్లీ)
ప్రభుత్వ సర్వీసు: ఇండియన్‌ పోలీసు సర్వీసు, విశ్రాంత డీజీపీ, తెలంగాణ
మహేందర్‌రెడ్డికి పోలీసుశాఖలో సంస్కరణలకు ఆద్యుడిగా, ధీశాలిగా పేరుంది. సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సొంతగ్రామం కిష్టాపురం. వరంగల్‌ రీజినల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (ప్రస్తుత ఎన్‌ఐటీ)లో బీటెక్‌ సివిల్‌ చదివారు. దిల్లీ ఐఐటీలో ఎంటెక్‌ చదువుతూ 1986లో సివిల్స్‌కు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో జగిత్యాల, గుంటూరు, గోదావరిఖనిలో ఏఎస్పీగా పనిచేస్తూ మావోయిస్టు గ్రూపుల నియంత్రణతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా, నిజామాబాద్‌, కరీంనగర్‌, గుంటూరు, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేశారు. సైబరాబాద్‌ కమిషనర్‌గా నాలుగేళ్లు పనిచేశారు. గ్రేహౌండ్స్‌లో కమాండో ఆర్గనైజేషన్‌ చీఫ్‌గా, ఇంటెలిజెన్స్‌ ఐజీగా, హైదరాబాద్‌ సీపీగా పనిచేశారు. డీజీపీగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ సంస్కరణలు తీసుకువచ్చారు. పోలీసు శాఖలో 30 ఏళ్లపాటు పనిచేసిన ఆయనకు ఐపీఎం, పీఎం, పీపీఎం అవార్డులు లభించాయి.


అనితా రాజేంద్ర

పుట్టినతేదీ: 4-2-1963
స్వస్థలం: చంచల్‌గూడ, పాతబస్తీ, హైదరాబాద్‌
విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
ప్రభుత్వ సర్వీసు: ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు (ఐఏఎస్‌), విశ్రాంత ముఖ్యకార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్‌కు చెందిన అనితా రాజేంద్ర 1992లో ప్రభుత్వసర్వీసులో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ శాఖకు పలు అవార్డులు లభించాయి. 2023 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు.


నర్రి యాదయ్య

పుట్టిన తేదీ: 10-2-1964
స్వస్థలం: సర్వేల్‌, యాదాద్రిజిల్లా
విద్యార్హత: ఎంటెక్‌, పీహెచ్‌డీ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
ప్రభుత్వ సర్వీసు : సీనియర్‌ ప్రొఫెసర్‌, జేఎన్‌టీయూ హైదరాబాద్‌
యాదాద్రి జిల్లా సర్వేల్‌లోని మల్లారెడ్డిగూడకు చెందిన నర్రి యాదయ్య 1992లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బోధన వృత్తిని ప్రారంభించారు.  జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు నాలుగున్నరేళ్లుగా రిజిస్ట్రార్‌గా, ప్రిన్సిపల్‌, వైస్‌ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 2016 నుంచి ఈఈఈ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.


యరబాడి రామమోహనరావు

పుట్టినతేదీ: 15-4-1963
స్వస్థలం: దేసినేనిపాలెం, మధిర, ఖమ్మం జిల్లా
విద్యార్హత: బీఈ (సివిల్‌), ఎంబీఏ
ప్రభుత్వ సర్వీసు: ఈడీ, టీఎస్‌జెన్‌కో జల      విద్యుత్తు విభాగం
రామమోహనరావు  1986లో విద్యుత్తు బోర్డులో ఏఈగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ)గా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జెన్‌కోలలో ఈఈ, ఎస్‌ఈ, సీఈగా పనిచేశారు. 2022లో తెలంగాణ జెన్‌కో జలవిద్యుత్తు విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)గా పదోన్నతి పొంది ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్నారు.


పేరు : పాల్వాయి రజినీకుమారి

పుట్టిన తేదీ: 6-5-1972
స్వస్థలం: సూర్యాపేట
విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ, బీఈడీ
ప్రభుత్వ సర్వీసు: విశ్రాంత గ్రూప్‌-1 అధికారిణి, రాజకీయ నాయకురాలు
పాల్వాయి రజినీకుమారి 1996లో నల్గొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో టీచర్‌గా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో గ్రూప్‌-1 సర్వీసుకు ఎంపికయ్యారు. 2004లో సర్వీసుకు రాజీనామా చేసి సూర్యాపేట నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. 2014లో తుంగతుర్తి నుంచి బరిలో నిలిచారు. అనంతరం భాజపాలో.. గత ఏడాది కాంగ్రెస్‌లో చేరారు.


ప్రొఫెసర్‌ అమీరుల్లా ఖాన్‌

వయసు: 58 సంవత్సరాలు
స్వస్థలం: హైదరాబాద్‌
విద్యార్హత: బీటెక్‌, పీహెచ్‌డీ
ప్రభుత్వ సర్వీసు: విశ్రాంత పోస్టల్‌ సర్వీసు అధికారి
హైదరాబాద్‌కు చెందిన అమీరుల్లాఖాన్‌  1993లో ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసుకు ఎంపికయ్యారు. 1995లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2004లో దిల్లీ జేఎంఐ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. ఉర్దూ యూనివర్సిటీలో సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణకు డైరెక్టర్‌గా పనిచేశారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా, పాలసీ అడ్వైజర్‌గా వ్యవహరించారు. గ్లోకల్‌ యూనివర్సిటీకి వ్యవస్థాపక వైస్‌ఛాన్సలర్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు