16/11/2022 10:00(IST)
అగ్గిపెట్టుందా...
కథానాయకుడు కృష్ణ నటన, హావభావాలు, ఆయన నృత్యాలు, సంభాషణలు చెప్పే విధానం ప్రత్యేకం. ఈతరం కుర్రకారు సైతం ఆయన హావభావాల్ని అనుకరిస్తుంటారు. ఆయన తొలినాళ్లల్లోనే సినిమాల్లో సుదీర్ఘమైన సంభాషణల్ని పలికి ప్రేక్షకుల్ని అలరించారు. ‘అగ్నిపర్వతం’ సినిమాలో అగ్ని జమదగ్ని... అంటూ అగ్గిపెట్టె అడిగే సన్నివేశాలు, ‘వీళ్లు అడ్రస్ లేనివాళ్లు కాదు ఆఫీసర్...’, ‘కన్నీటికి అర్థం తెలిసిన మనుషులు, కష్టానికి నిర్వచనం తెలిసిన మనుషులే ఇలాంటి సాయం చేస్తారు ఆఫీసర్’ అంటూ ఆయన చెప్పిన సంభాషణలు అప్పట్లో పాపులర్ అయ్యాయి. వందో చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’లో ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒకొక్క విప్లవవీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగి స్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం. స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై... నీటిలో నీటినై... నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనుషుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై... నా జాతి జనులు పాడుకునే సమరగీతాన్నై... సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా ఇక్కడ కాల్చు... వందే మాతరం’ అంటూ ఆయన చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఉద్రేకానికి గురిచేశాయి. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. 200వ చిత్రం ‘ఈనాడు’లోనూ ఆయన చెప్పిన సంభాషణలు అంతే శక్తివంతంగా సాగుతాయి. ‘ఈ చేతులు పేదవాడి ఆక్రోశంతో రాటు దేలిపోయాయి. దగా పడిన తమ్ముళ్ల ఆవేదనతో కరుకు తేలిపోయాయి’, ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులే చీకటి మాటుకు పారిపోయారు, నువ్వెంత? పర్వతంలో పరమాణువులాంటివాడివి, సముద్రంలో ఇసుక రేణువులాంటివాడివి’ అనే సంభాషణల్ని కృష్ణ చెప్పిన తీరు ప్రత్యేకం.