వేలంలో కొంటే అది ప్రైవేటు భూమే

బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. బహిరంగ వేలంలో కొన్నప్పుడు దానిని ప్రైవేటు భూమిగానే చూడాలని, అసైన్డ్‌గా

Updated : 28 Jan 2022 10:00 IST

స్పష్టం చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. బహిరంగ వేలంలో కొన్నప్పుడు దానిని ప్రైవేటు భూమిగానే చూడాలని, అసైన్డ్‌గా పరిగణించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నిషేధిత జాబితాలో చేర్చుతూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కొట్రమంగళంలోని వివిధ సర్వే నంబర్లలోని 9 ఎకరాల అసైన్డ్‌ భూమిని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) బహిరంగ వేలం వేయగా తాము కొన్నామని, వాటిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో(22ఏ) చేర్చిందంటూ పి.గీత, మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ‘అసలైన అసైన్డ్‌దారులు ఆ భూములను పీఏసీఎస్‌కు తనఖాపెట్టి రుణం పొందారు. తిరిగి చెల్లించనందున వాటి అమ్మకానికి పీఏసీఎస్‌ బహిరంగ వేలం వేసింది. పిటిషనర్లు కొనుగోలు చేసి, విక్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందారు. నేపథ్యం తెలుసుకోకుండా అధికారులు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. అసైన్డ్‌ భూమిని తనఖాపెట్టి, తర్వాత వేలంలో అమ్మినప్పుడు అది ప్రైవేటు భూమి అవుతుందని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింద’ని వాదించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది స్పందిస్తూ.. వేలం నిర్వహించినప్పటికీ అది అసైన్డ్‌ భూమిగానే ఉంటుందన్నారు.

అధికారుల తీరు అశ్చర్యకరం
ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఓసారి భూమిని అసైన్‌మెంట్‌ కింద కేటాయించాక ప్రభుత్వం యజమాని హోదా కోల్పోతుంది. లబ్ధిదారే యజమాని అవుతారు. మళ్లీ ఆ భూమిని చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటేనే ప్రభుత్వం యజమాని అవుతుంది. ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిషేధ చట్టంలోని సెక్షన్‌ 2(1), సెక్షన్‌ 6ను సంయుక్తంగా కలిపి చదివితే.. అసైన్డ్‌ భూములను సహకార సంఘాలు, బ్యాంకుల్లో తనఖా పెట్టొచ్చని, తీసుకున్న అప్పు చెల్లించకపోతే రుణసంస్థలు ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు’ అని పేర్కొన్నారు. ‘గతంలో హైకోర్టు తీర్పు ఇస్తూ రుణం రాబట్టుకునేందుకు పీఏసీఎస్‌లు, బ్యాంకులు వేలం వేసిన భూములను అసైన్డ్‌గా పరిగణించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ లెక్కన పిటిషనర్లు కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం చట్టవిరుద్ధం’అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని