ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం

ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్‌ ప్రభుత్వానికి పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది.

Published : 27 Apr 2024 04:13 IST

ఉద్యోగులకు సరెండర్‌ లీవ్స్‌ నగదు చెల్లింపు
ఒక్కొక్కరి ఖాతాలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జమ
ఇన్నాళ్లూ వేధించి.. ఇప్పుడు బుజ్జగింపులా?
మిగిలిన బకాయిల సంగతేంటని ఉద్యోగుల ప్రశ్న

ఈనాడు, అమరావతి: ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్‌ ప్రభుత్వానికి పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగులకు సరెండర్‌ లీవుల బకాయిలను హడావుడిగా చెల్లిస్తోంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో గురు, శుక్రవారాల్లో బకాయిలు జమయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వేయగా, ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశముంది. ఇన్నాళ్లూ తమపై కక్షగట్టి, హక్కులను కాలరాసి, స్వేచ్ఛను హరించి, గొంతు నొక్కేసిన ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఎర వేస్తోందా అని ఉద్యోగ సంఘాల నేతలే ప్రశ్నిస్తున్నారు. ‘మాలోని ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది. మాకు హక్కుభుక్తంగా రావాల్సిన సరెండర్‌ లీవ్‌ సొమ్ములనే విడుదల చేసి, ఏదో లబ్ధి చేకూర్చినట్లుగా భ్రమ కల్పిస్తోంది. న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ మేం ఎప్పటి నుంచో గొంతు చించుకుని అరుస్తున్నా పట్టించుకోలేదు. పైగా మా ఆందోళనలు, ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసింది’ అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ‘మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. సుమారు రూ.17 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, అవన్నీ పెండింగ్‌లో పెట్టింది. సరెండర్‌ లీవుల బకాయిలు మాత్రమే చెల్లిస్తోంది. అదీ అందరికి ఒకేసారి ఇవ్వకుండా, విడతల వారీగా రోజుకు కొందరి ఖాతాల్లో వేయడం దేనికి సంకేతం?’ అని ఉద్యోగ సంఘం నేత ఒకరు ప్రశ్నించారు.

రూ.17 వేల కోట్ల మాటేంటి?

ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా రూ.17 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. డీఏ, పీఆర్సీ బకాయిలు రూ.7,500 కోట్లు రావాలి. వీటిని 2027లోగా దశల వారీగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడమే తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే ఆ బాధ్యతను వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసింది. టీఏ, డీఏ బకాయిలు రూ.274 కోట్ల వరకు ఉన్నాయి. సరెండర్‌ లీవుల బకాయిలు రూ.2,250 కోట్లు ఉండగా, వీటిలో పోలీసులకు చెల్లించాల్సిన సొమ్మే రూ.500 కోట్లు. 2021-22 నాటికి పెండింగ్‌లో ఉన్న బకాయిలు మరో రూ.300 కోట్లు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు రూ.118 కోట్లు విడుదల చేయలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సీపీఎస్‌ మొత్తాన్ని ప్రాన్‌ ఖాతాకు జమ చేయాల్సినవి సుమారు రూ.933 కోట్లు ఉన్నాయి. సీపీఎస్‌, పెన్షనర్లకు నగదు రూపంలో డీఏ బకాయిలు రూ.2,100 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2022లో ఇవ్వాల్సిన రెండు డీఏల బకాయిలు కలిపి రూ.4,500 కోట్లు ఉన్నాయి.

ఐదేళ్లుగా కాల్చుకు తిని, ఇప్పుడు బుజ్జగింపులు:

  • గతంలో ఎప్పుడూ లేనంతగా జగన్‌ సర్కారు ఉద్యోగులను పలురకాలుగా వేధించింది. 11వ పీఆర్సీలో మోసగించింది. మధ్యంతర భృతి(ఐఆర్‌) 27 శాతముంటే, దానిలో 4% తగ్గించి 23% ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఉద్యోగులు ఐఆర్‌తో పొందిన జీతం కంటే ఫిట్‌మెంట్‌తో తీసుకున్న జీతం తగ్గిపోవడం చరిత్రలో తొలిసారి.
  • ఇంటి అద్దె భత్యంలోనూ కోత పెట్టింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వహయాంలో 30 శాతమున్న హెచ్‌ఆర్‌ఏను 24 శాతానికి తగ్గించింది. జిల్లా కేంద్రాల్లో 20 శాతమున్న హెచ్‌ఆర్‌ఏను 16 శాతానికి కుదించింది.
  • 11వ పీఆర్సీ సిఫారసు చేసిన పేస్కేళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ వేసింది. 2023 జులై నుంచే కొత్త పీఆర్సీ అమలు కావాలి. ఆలస్యమైనందున ఐఆర్‌ ఇవ్వాలి. ఆ గడువు దాటి 10 నెలలైనా ఇప్పటికీ ఐఆర్‌ ప్రకటించలేదు.
  • ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలపై ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన దాష్టీకాలకు అంతేలేదు. పీఆర్సీ అంశంపై 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఆందోళనను అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించింది. లక్షల మంది ఉద్యోగులు బీఆర్‌టీఎస్‌ రహదారిని దిగ్బంధించడంతో కంగుతిన్న ప్రభుత్వం.. అనేక మందిని అరెస్ట్‌ చేసి, కేసులు పెట్టింది. నాటి నుంచే ఉద్యోగులపై కక్షగట్టింది.  
  • ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, వైకాపా నాయకులు ఉద్యోగులను అవమానాలకు గురిచేశారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లకు   కాపలా ఉంచి, మరుగుదొడ్లు కడిగించి అవమానించారు.

ఎన్నికల వేళ ఓట్ల కోసం ప్రేమ కురిపిస్తే, ఇన్నాళ్లూ ఎదుర్కొన్న వేధింపులను మర్చిపోతామా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రూ.17 వేల కోట్లకుపైగా ఉన్న బకాయిలను పూర్తిగా ఎందుకు చెల్లించడం లేదు? కోడ్‌ అమలులో ఉన్నప్పుడు బకాయిల విడుదల అంటే.. ఉద్యోగులను ప్రలోభపెట్టే చర్యేనని వారికీ తెలుసు’ అని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


జగన్‌ భయపడ్డారా?

ఐదేళ్లుగా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను పెడచెవిన పెట్టిన జగన్‌కు ఇప్పుడు భయం పట్టుకుందా? ఉద్యోగులంతా వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవన్న ఆందోళనలో ఉన్నారా? అందుకే... ఇంత హైరానా పడుతున్నారా? ఇన్నాళ్లూ లెక్కలేనట్టు ప్రవర్తించిన సీఎంకు ఇప్పుడు ఒక్కసారిగా వారిపై ప్రేమ పుట్టుకురావడానికి ఆ భయమే కారణమా? అందుకే సరెండర్‌లీవ్‌ల బకాయిలు చెల్లించి మంచి చేసుకోవాలనుకుంటున్నారా? అన్న చర్చ ఉద్యోగవర్గాల్లో జరుగుతోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక డిమాండ్లు, వేల కోట్ల బకాయిల గురించి ఇన్నాళ్లూ పట్టించుకోని ముఖ్యమంత్రికి ఇప్పుడు హఠాత్తుగా సరెండర్‌లీవుల బకాయిలు గుర్తొచ్చాయంటే అది ముమ్మాటికీ ఎన్నికల మహిమేనన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిల్ని చెల్లించకుండా, కేవలం సరెండర్‌ లీవుల డబ్బులు ఇచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం వారిలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని