మట్టి అక్రమాల పరిశీలనకు వెళ్లిన తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అడ్డగింత

మట్టి అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం

Published : 25 May 2022 05:42 IST

ఘర్షణలో తెదేపా కార్యకర్తకు గాయాలు

శేకూరు (చేబ్రోలు), న్యూస్‌టుడే: మట్టి అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరులో మంగళవారం ఈ ఘటన జరిగింది. నాగులకోడు చెరువులో 4 రోజుల కిందట స్థానిక నేతలు, రెవెన్యూ సిబ్బంది కలిసి మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తెదేపా కార్యకర్తలు నరేంద్రకు తెలపడంతో చెరువు పరిశీలనకు బయలుదేరారు. ఇది తెలియడంతో వైకాపా సానుభూతిపరులు పెద్దఎత్తున మోహరించారు. నరేంద్ర ఆ ప్రాంతాన్ని పరిశీలించి, వెళుతుండగా మహిళలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. వైకాపా శ్రేణులు, మహిళలు దారికి అడ్డంగా అరగంటకు పైగా కూర్చున్నారు. ఈ క్రమంలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త మాతంగి అశోక్‌పై కొందరు దాడి చేశారు. ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో వైద్యశాలకు తరలించారు.  ధూళిపాళ్ల, ఆయన అనుచరులు అనుమతి లేకుండా పంచాయతీ కార్యాలయంలోకి ప్రవేశించి సిబ్బందిని, పాలకవర్గాన్ని భయబ్రాంతులకు గురిచేశారని శేకూరు గ్రామ సర్పంచి మాతంగి శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువును పరిశీలించేందుకు వచ్చిన నరేంద్రను ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా... ఆయన అనుచరులు ఎస్సీ మహిళలపై అమానుషంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని