Adani: బొగ్గు టెండరూ అదానీకే

జెన్‌కో విదేశీ బొగ్గు కొనుగోలు టెండరూ అదానీకే చిక్కింది. టన్ను బొగ్గు రూ.13,100 చొప్పున ఆ సంస్థ కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచింది. ఈ మేరకు అదానీ సంస్థతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

Updated : 09 Mar 2023 07:29 IST

టన్ను రూ.13 వేలైనా విదేశీ బొగ్గు కొనుగోలుకు జెన్‌కో ఒప్పందం
7.5 లక్షల టన్నులకు టెండరు ఖరారు
ప్రభుత్వంపై రూ.300 కోట్ల అదనపు భారం
దేశీయంగా దొరికే బొగ్గు టన్ను రూ.5 వేలే
ఈనాడు - అమరావతి

జెన్‌కో విదేశీ బొగ్గు కొనుగోలు టెండరూ అదానీకే చిక్కింది. టన్ను బొగ్గు రూ.13,100 చొప్పున ఆ సంస్థ కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచింది. ఈ మేరకు అదానీ సంస్థతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశీయ బొగ్గును టన్ను రూ.5 వేలకు జెన్‌కో కొంటోంది. దీని గ్రాస్‌ కెలోరిఫిక్‌ వాల్యూ (జీసీవీ) సుమారు 4వేలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు జీసీవీ 6,500 వరకు ఉంటుంది. చెల్లించే ధరతో పోలిస్తే, పెరిగే జీసీవీ తక్కువే అయినా.. 162% అధిక మొత్తం చెల్లించి అదానీ నుంచి బొగ్గు కొనాలనే ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా విదేశీ బొగ్గు టన్ను రూ.9 వేలకు మించి కొంటే భారమేనని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఖజానాపై పడే అదనపు భారం సుమారు రూ.300 కోట్లు. బొగ్గు కొనుగోలుకు రూ.982.50 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది.

ముచ్చటగా మూడోసారి

కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి అవసరమైన 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్‌ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌) గత జనవరిలో టెండరు ప్రకటన జారీచేసింది. దీనికి అదానీ సంస్థతో పాటు చెట్టినాడు, ఎంబీఎస్‌, తరుణ్‌, ఆది సంస్థలు బిడ్‌ దాఖలుచేశాయి. ప్రైస్‌బిడ్‌లో చెట్టినాడు సంస్థ ఎల్‌1గా నిలిచింది. ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌లో అదానీ సంస్థ మరింత తక్కువ కోట్‌చేసి టెండరు దక్కించుకుంది. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించే బొగ్గులో 6% విదేశీబొగ్గు కలపాలని, దేశవ్యాప్తంగా బొగ్గుకు ఉన్న కొరత దృష్ట్యా మరో 9నెలలు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు సర్దుబాటు చేసుకోవాలని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సూచించింది. ఏపీ జెన్‌కో 10 లక్షల టన్నుల బొగ్గు కొనాలని తొలుత భావించింది. విదేశీ బొగ్గు కొనుగోలుకు గతంలో రెండుసార్లు టెండర్లు పిలిస్తే టన్ను బొగ్గుకు దాదాపు రూ.18వేల వరకు బిడ్‌లు దాఖలయ్యాయి. ఈ ధర ఎక్కువని టెండర్లను జెన్‌కో రద్దుచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టులు, సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులు, విశాఖలో డేటాసెంటర్‌, పోర్టులను దక్కించుకున్న అదానీ సంస్థ.. జెన్‌కోకు బొగ్గు సరఫరా టెండరునూ దక్కించుకుంది. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వహణను అదానీకి అప్పగించాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమన్న ఆరోపణలు ఉన్నాయి.

రష్యా.. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా యూరోప్‌ దేశాలకు రష్యా నుంచి చమురు, సహజవాయువు సరఫరా నిలిచింది. అందువల్ల ఆయా దేశాలు విద్యుత్‌ ఉత్పత్తి, ఇతర అవసరాలకు బొగ్గును ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో ఇండోనేసియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మలేషియా మార్కెట్లలో బొగ్గుకు డిమాండు ఏర్పడింది. ఈ కారణంగా గతంలో టన్ను రూ.7వేలకు దొరికే బొగ్గు.. ప్రస్తుతం రూ.10-11వేల వరకూ ఉందని నిపుణులు చెబుతున్నారు. రవాణా ఖర్చులు, పోర్టు హ్యాండ్లింగ్‌ ఛార్జీలు కలిపినా అదానీ సంస్థ కోట్‌ చేసిన ధర కొంచెం ఎక్కువేనని పేర్కొంటున్నారు.కృష్ణపట్నంలో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడో యూనిట్‌ను వాణిజ్య ఉత్పత్తిలోకి (సీవోడీ) జెన్‌కో తీసుకొస్తోంది. రెండు రోజులుగా ప్లాంటు నుంచి వచ్చే విద్యుత్తును పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రానికి సీవోడీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జెన్‌కో థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గునిల్వలు లేవు. వీటీపీఎస్‌, ఆర్‌టీపీపీ, కృష్ణపట్నం ప్లాంట్ల దగ్గర కలిపి 60వేల టన్నులే ఉంది. ఇది ఒక్కరోజుకే సరిపోతుంది. అందుకే నిల్వలు పెంచుకోవాలని విదేశీ బొగ్గు కొనుగోలుకు జెన్‌కో నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని