icon icon icon
icon icon icon

Chandra babu: తిరుగుబాటు మొదలైంది.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు

రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 25 Apr 2024 20:00 IST

రాజంపేట: రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే మిథున్‌రెడ్డి ఓడిపోవాలన్నారు. వైకాపాకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

‘‘రాజంపేట జిల్లా ఏర్పాటు చేయకుండా ఇక్కడి వారికి అన్యాయం చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేసి అభివృద్ధి చేస్తాం. రాజంపేట, రాయచోటి, మదనపల్లె.. దేనికీ అన్యాయం చేయం. ఎక్కడైనా ప్రజాభిప్రాయం మేరకే పాలన జరగాలి. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్‌కుమార్‌రెడ్డిది. మేం వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి.. బాధితులను ఆదుకుంటాం. పేదలకు రెండు..మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తాం. గాలేరు-నగరి కాలువ పూర్తి చేసి.. కృష్ణా జలాలు తీసుకొస్తాం. ఏప్రిల్‌ నుంచే పింఛను రూ.4వేలు ఇంటి వద్దే ఇస్తాం. 3 నెలల బకాయిలు జులైలో ఇస్తాం. తెదేపా మద్దతుదారుల పింఛన్లు తీసేశారు.. మేం వచ్చాక ఇస్తాం. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం: పవన్‌

రాజంపేట: వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాజంపేటలో నిర్వహించిన తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి సభలో పవన్‌ మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి తీసుకొచ్చిన రౌడీయిజం, ఫ్యాక్షనిజం అంతం కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు.

‘‘రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది.. ఇది మారాలి. ఓడిపోతామని తెలిసి జగన్‌.. 70 నియోజవకర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు. అందులో రాజంపేట మొదటిది. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌రెడ్డి నేను పోటీ చేస్తున్న పిఠాపురం వచ్చి నన్ను ఓడిస్తారట. యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు?పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా?ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై తిరుగుతున్నారు. సంపదంతా పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, కుమారుడు మిథున్‌రెడ్డి వద్దే ఉండిపోయింది. అన్నమయ్య డ్యామ్‌ ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారు. డ్యామ్‌లో ఇసుక తోడేయడం వల్ల 39 మంది చనిపోయారు. డ్యామ్‌లు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి పట్టించుకోరు. ప్రశాంతంగా కూర్చుని మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి ముఠా నేతలు రూ.10వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారు. ’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img