ఏపీ డీజీపీపై బదిలీ వేటు

అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది.

Updated : 06 May 2024 07:00 IST

వైకాపాకు కొమ్ముకాస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదులతో రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు
అధికార పార్టీ అరాచకాలకు వెన్నుదన్ను ఆయనే
బాధిత ప్రతిపక్షాలపైనే రివర్స్‌ కేసులు
ప్రభుత్వానికి ఎదురుతిరిగినవారికి వేధింపులు
ఈనాడు - అమరావతి

ధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. పోలీసుదళాల అధిపతిగా ఉంటూ.. వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి ఆయన్ను బదిలీ చేసింది. ఎన్నికల కోడ్‌ వచ్చాక కూడా రాజేంద్రనాథరెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదులపై చాలా ఆలస్యంగా స్పందించింది. ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఆయన తర్వాత స్థానంలోని అధికారికి బాధ్యతలు అప్పగించేసి, వెంటనే రాజేంద్రనాథరెడ్డిని డీజీపీ విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది. ఆయన స్థానంలో మరొకర్ని నియమించేందుకు వీలుగా ముగ్గురు డీజీ ర్యాంకు ఐపీఎస్‌ అధికారుల పేర్లు, వివరాలతో సోమవారం ఉదయం 11 గంటల్లోగా ప్యానల్‌ జాబితా సమర్పించాలని ఆదేశించింది. గత ఐదేళ్లలో వారి ఏపీఏఆర్‌ గ్రేడింగ్‌, విజిలెన్స్‌ క్లియరెన్స్‌ల వివరాలను ప్యానల్‌తో పాటు పంపాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు రాజేంద్రనాథరెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులిచ్చారు.

జగన్‌ పీనల్‌ కోడ్‌ అమలు చేసిన రాజేంద్రనాథరెడ్డి

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కన పెట్టేసి మరీ 2020 ఫిబ్రవరి 15న కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించారు. రెండేళ్ల రెండు నెలలుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి (రెగ్యులర్‌) డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోం శాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ఆదేశాలను పట్టించుకోలేదు. రాజేంద్రనాథరెడ్డి ‘తమవాడు’ కావటమే ఏకైక అర్హతగా సీనియార్టీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే ఆయన్ను డీజీపీగా నియమించారు. దీనికి కృతజ్ఞత తీర్చుకోవటానికి అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు అరాచకాలకు తెగబడ్డా, అక్రమాలకు పాల్పడ్డా ఆయన వెన్నుదన్నుగా నిలబడ్డారు. వైకాపాకు రాజకీయంగా గిట్టనివారిని అక్రమ కేసులతో వేధించారు. ప్రతిపక్షాలను తీవ్రంగా అణచివేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని వేధించారు. భౌతిక దాడులు చేసిన అధికార పార్టీ నాయకుల్ని వదిలేసి బాధితులపైనే రివర్స్‌ కేసులతో హడలెత్తించారు. విపక్ష పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు చిన్న నిరసనకు పిలుపిచ్చినా వారిని గృహనిర్బంధం చేశారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టడం దీనికి పరాకాష్ఠ. అధికార పార్టీ నాయకులు తమ అరాచకాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలను దిగజార్చేస్తుంటే వారికి వత్తాసు పలికారు. ఐపీసీని పక్కనపెట్టి జేపీసీ (జగన్‌ పీనల్‌ కోడ్‌) అమలు చేశారు. సీఆర్‌పీసీ స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ (వైఎస్‌ఆర్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌) పాటించారు. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుచిత ప్రయోజనం కలిగించటం కోసం.. కరడుగట్టిన వైకాపా కార్యకర్తల్లా పనిచేసే వారిని కీలక స్థానాల్లో నియమించారు.

ప్రతిపక్ష నాయకులపై దూషణలు.. రాజకీయ నేతలా ప్రకటనలు

పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా నాయకులు తెదేపా నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పంటించి దమనకాండకు పాల్పడితే దాడి చేసినవారినే వెనకేసుకొస్తూ మాట్లాడారు. ‘వివాదాస్పద ప్రాంతాల్లో మీకేం పని? మిమ్మల్ని అక్కడికి ఎవడు వెళ్లమన్నాడు?’ అంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. అమరావతి రైతులు హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తుంటే వారిపై అడుగడుగునా ఆంక్షలు, నిర్బంధాలు, దౌర్జన్యాలతో తీవ్రంగా హింసించారు. అమరావతి రైతుల పాదయాత్ర మార్గంలోకి అధికార వైకాపా నాయకులు దూసుకెళ్తూ దాడులకు పాల్పడుతుంటే.. నిరసన తెలియజేసుకోవచ్చంటూ ఆ దాడులను ప్రోత్సహించేలా మాట్లాడారు. ప్రతిపక్ష నేతలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టారు. ప్రతిపక్షాల వారిపై ఫిర్యాదులివ్వడానికి వచ్చే అధికార పార్టీ నాయకులను సాదరంగా ఆహ్వానించి, ఫిర్యాదులు స్వీకరించేవారు. వైకాపా నాయకుల దాష్టీకాలపై ఫిర్యాదులివ్వడానికి వెళ్లే ప్రతిపక్ష నాయకుల్ని కనీసం డీజీపీ కార్యాలయం లోపలికి కూడా రానివ్వలేదు. దీనిపై ప్రశ్నించినందుకు ప్రతిపక్షాల వారిపై కేసులు పెట్టారు. 24 నెలల పదవీకాలంలో ఎన్నికల కోడ్‌ వచ్చాక మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో ఇటీవల ప్రతిపక్ష తెదేపా నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. రాజేంద్రనాథరెడ్డి వైకాపాకు ఎంత ఏకపక్షంగా పనిచేశారో చెప్పేందుకు ఈ ఒక్క ఉదంతం చాలు.

ఎన్నికల కోడ్‌ వచ్చాక మరింత స్వామిభక్తి

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక రాజేంద్రనాథరెడ్డి అధికార వైకాపా పట్ల మరింత స్వామిభక్తిని ప్రదర్శించారు. చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగ సభకు అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారన్న ఫిర్యాదులున్నాయి. మైక్‌ సిస్టమ్స్‌ దగ్గర సరైన భద్రత కల్పించలేదు. సభా ప్రాంగణంలోని స్తంభాలపైకి ఎక్కుతున్నవారిని పోలీసులు అడ్డుకోలేదు. ప్రధానమంత్రే జోక్యం చేసుకుని, వారిని స్తంభాలపై నుంచి దిగాలని కోరాల్సి వచ్చింది. వైకాపా నాయకులు.. ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడుతుంటే ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను తగలబెట్టేస్తే కనీసం స్పందించలేదు. ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీల వారిని బెదిరిస్తూ, దాడులు చేస్తుంటే మౌనంగా ఉంటూ వాటన్నింటికీ పరోక్షంగా సహకరించారు. అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోలేదు సరికదా.. బాధితులైన ప్రతిపక్షాల వారిపైనే రివర్స్‌ కేసులు పెట్టారు. ఆయన అండదండలతో స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే సార్వత్రిక ఎన్నికల్నీ ఏకపక్షంగా మార్చేసేందుకు వైకాపా కుట్ర చేసిందని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. విచారణ జరిపిన ఎన్నికల సంఘం డీజీపీపై వేటు వేసింది.

వైకాపా హయాంలో అన్నీ కీలక బాధ్యతలే

1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన రాజేంద్రనాథరెడ్డికి వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలకమైన పోస్టింగులిచ్చింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీపీగా, ఆ తర్వాత నిఘా విభాగాధిపతిగా బాధ్యతలు అప్పగించింది. కొన్నాళ్లకు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా పంపింది. ఆ పోస్టులో ఉండగానే ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించింది.


వైకాపా దురాగతాలకు మార్గదర్శకత్వం

  • మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు రాజేంద్రనాథరెడ్డి సహకరించలేదని, పైగా అరెస్ట్‌ చేయకుండా నిరోధించారన్న ఫిర్యాదులున్నాయి.
  • డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారు. వైకాపా దురాగతాల్లో చాలావాటికి ఆయనదే మార్గదర్శకత్వం.  
  • రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై గానీ, దానికి కారకులైన వైకాపా నాయకులపైగానీ డీజీపీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ప్రేక్షకుడిలానే వ్యవహరించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని