Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి

Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.

Published : 07 Mar 2024 12:20 IST

దిల్లీ: ఫిబ్రవరిలో వాహన రిటైల్‌ విక్రయాలు (Automobile Sales) వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగినట్లు ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం వెల్లడించింది. ప్రయాణికుల, ద్విచక్ర వాహనాలు సహా అన్ని విభాగాల్లో అమ్మకాలు పుంజుకున్నాయని తెలిపింది. క్రితం ఏడాది ఇదే నెలలో 17,94,866 యూనిట్ల విక్రయాలు నమోదవగా.. ఈసారి ఆ సంఖ్య 20,29,541కు చేరినట్లు తెలిపింది.

  • ప్రయాణికుల వాహన విక్రయాలు 2023 ఫిబ్రవరిలో 2,93,803 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈసారి అవి 12 శాతం పెరిగి 3,30,107కు చేరాయి. ఫిబ్రవరిలో ఈ విభాగంలో ఇప్పటి వరకు ఇవే రికార్డు విక్రయాలని ఫాడా తెలిపింది. కొత్త కార్ల విడుదల, వాహనాలు అందుబాటులో ఉండడమే అందుకు దోహదం చేసినట్లు వివరించింది.
  • ద్విచక్రవాహన అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగి 14,39,523 యూనిట్లకు చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ, ప్రీమియం మోడళ్లకు డిమాండ్‌, ఎంట్రీ లెవెల్‌ బైక్‌లకు ఆదరణ వంటి అంశాలు విక్రయాలకు దన్నుగా నిలిచినట్లు ఫాడా పేర్కొంది. పెళ్లిళ్ల సీజన్‌, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడం కూడా కలిసొచ్చినట్లు తెలిపింది.
  • వాణిజ్య వాహన విక్రయాలు క్రితం ఏడాదితో పోలిస్తే ఐదు శాతం పెరిగి 88,367 యూనిట్లకు చేరాయి. ఎన్నికల సీజన్‌ నేపథ్యంలో కొనుగోళ్ల వాయిదా వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఈ విభాగంలో వృద్ధి నమోదు కావడం విశేషమని ఫాడా అభిప్రాయపడింది.
  • త్రిచక్ర వాహన అమ్మకాలు 24 శాతం పెరిగి 94,918 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం పుంజుకొని 76,626కు పెరిగాయి.

వాహన విక్రయాలకు రాబోయే రోజుల్లోనూ సానుకూలతలు ఉన్నాయని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ప్రీమియం, ఎంట్రీ లెవెల్‌ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో వాణిజ్య, త్రిచక్ర వాహన విక్రయాలు సైతం పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని