logo

మెతుకుసీమలో త్రిముఖ పోరు

మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్‌సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది.

Updated : 30 Apr 2024 06:43 IST

సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు

న్యూస్‌టుడే-మెదక్‌: మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్‌సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది. నామినేషన్ల ఉపసంహరణ సోమవారంతో ముగియగా... ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ పోరు మాత్రం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాస మధ్యే నెలకొంది. అన్ని పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ప్రచారానికి కేవలం పదకొండు రోజులే మిగిలి ఉండడంతో ప్రత్యేక వ్యూహాలను రచిస్తూ... క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని వేడెక్కించేలా ఆయా పార్టీ శ్రేణులు కదన రంగంలోకి దిగారు. త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం... మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈసారి పెద్దసంఖ్యలో అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. వీరిలో భారాస నుంచి వెంకట్రామిరెడ్డి, భాజపా నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి నీలం మధు బరిలో ఉన్నారు. వీరితో పాటు బీఎస్పీ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

 పాతికేళ్ల తర్వాత మరో అవకాశం కోసం..

కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న భాజపా... మెదక్‌ స్థానం నుంచి రఘునందన్‌రావును బరిలో దింపింది. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీచేసిన ఆయన రెండోసారి బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2020 నవంబర్‌లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం...ప్రధాని మోదీ చరిష్మా కలిసిరానుందని భావిస్తున్నారు. నియోజకవర్గ చరిత్రలో ఒకసారి మాత్రమే భాజపా విజయం సాధించింది. పాతికేళ్ల తర్వాత మరోసారి అవకాశం ఉందని భావిస్తున్న కమలం పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మంగళవారం జిల్లాకు ప్రధాని మోదీ రానుండటంతో అవకాశాలు మరింత మెరుగుపడుతాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

బీసీ మంత్రంతో..

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే యోచనలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఈ మేరకు పార్టీ వ్యూహాత్మకంగా బీసీ సామాజికవర్గానికి చెందిన నీలం మధుకు టికెట్‌ కేటాయించింది. పటాన్‌చెరు మండలం చిట్కూల్‌ వార్డు సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన సర్పంచిగా పనిచేసి...ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆతర్వాత కాంగ్రెస్‌లో చేరి ఎంపీ ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం... గ్యారంటీల అమలు కలిసివస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. మంత్రి కొండా సురేఖకు లోక్‌సభ ఇన్‌ఛార్జీ బాధ్యతలు అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మెదక్‌లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో నిలవగా, సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక సెగ్మెంట్లలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆపార్టీ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.

సిట్టింగ్‌ స్థానం నిలుపుకొనేందుకు

2004 నుంచి వరుసగా ఈ స్థానంలో విజయకేతనం ఎగరవేస్తున్న భారత రాష్ట్ర సమితి(భారాస) ఈసారి సైతం సిట్టింగ్‌ స్థానాన్ని పదిలపర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు విశ్రాంత కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బరిలో దింపారు. 2002 నుంచి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పనిచేస్తున్న ఆయనకు కొంత అవగాహన ఉంది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎక్కువ రోజులు పనిచేయగా, మెదక్‌ జిల్లాలో కొద్దిరోజుల పాటు ఇన్‌ఛార్జీ కలెక్టర్‌గా కొనసాగారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తొలిసారి ప్రత్యక్ష పోరులో తలపడుతున్నారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలోనూ ఆరుచోట్ల భారాస ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండడం... మరోవైపు భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లా కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయా చోట్ల కొంత కేడర్‌ చేజారినా... ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా ఉండగా...మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ అభ్యర్థి గెలుపును తన భుజాలపై వేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసిన మెతుకుసీమ గడ్డపై మరోమారు సత్తాచాటే ప్రయత్నం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని