logo

దొంగల వెంట పోలీస్‌ పరుగో పరుగు

తాళం వేసిన ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు పోలీసులపై దాడికి యత్నించి పరారైన సంఘటన తూప్రాన్‌లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు..

Published : 07 May 2024 03:05 IST

తూప్రాన్‌, న్యూస్‌టుడే: తాళం వేసిన ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు పోలీసులపై దాడికి యత్నించి పరారైన సంఘటన తూప్రాన్‌లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన ఆటో డ్రైవరు జహంగీర్‌ కుటుంబంతో కలిసి ఆదివారం సాయంత్రం నిజామాబాద్‌ సమీపంలోని పెద్దగుట్టకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఇంటి తాళం పగలగొట్టి దొంగలు లోపలికి చొరబడ్డారు. గమనించిన కొందరు గ్రామస్థులు విషయాన్ని గస్తీ నిర్వహించేందుకు వచ్చిన కానిస్టేబుల్‌ సలక్షణ్‌గౌడ్‌, హోంగార్డు నరసింహులుకు తెలిపారు. వారు ఇంటి సమీపంలోకి వెళ్లగానే గమనించిన దొంగలు పరుగెత్తడం ప్రారంభించారు. కానిస్టేబుల్‌ సలక్షణ్‌గౌడ్‌ అప్రమత్తమై వారిని పట్టుకునేందుకు వెనకాలే పరుగెత్తుతూ చేతిలోని లాఠీని విసిరారు. అది ఓ దొంగ కాళ్లకు తగలడంతో కిందపడిపోయాడు. అతడిని పట్టుకునేందుకు యత్నిస్తుండగా.. ముందు పరుగెడుతున్న మరో ఇద్దరు దొంగలు వెనక్కి వచ్చి రాళ్లు, ఇతర ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో సలక్షన్‌గౌడ్‌ చేతిలోని లైటింగ్‌ బ్యాటరీ ధ్వంసమైంది. అంతలోనే కిందపడిన దొంగను మిగతావారు పైకి లేపి తీసుకెళ్లిపోయారు.

దొంగలు వచ్చింది ఆ కారులోనేనా?

దొంగల వెనకాల సలక్షణ్‌గౌడ్‌ పరుగెత్తుతుండగా.. అక్కడే నిలిపిన కారు అనుసరించింది. కొద్దిదూరం వెళ్లాక ఆ కారులోనే దొంగలంతా కలిసి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని