logo

బెడిసికొట్టిన వ్యాపారి కుమారుడి కిడ్నాప్‌

అయిదుగురు కలిసి ఓ వ్యాపారి కుమారుడిని అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. వీరిలో ముగ్గురు పట్టుబడగా ఇద్దరు పరారీలో ఉన్నారు.

Updated : 01 Feb 2023 06:20 IST

అయిదుగురిలో ఇద్దరు పథకం మార్చడంతో బహిర్గతం
ముగ్గురు అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అయిదుగురు కలిసి ఓ వ్యాపారి కుమారుడిని అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. వీరిలో ముగ్గురు పట్టుబడగా ఇద్దరు పరారీలో ఉన్నారు. కేపీహెచ్‌బీ పోలీసులకు చిక్కారు. ఎస్సై వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. హైదర్‌నగర్‌లో ఓ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ కంపెనీ యజమాని నాగేశ్వరరావు వద్ద పెనుగొండకు చెందిన చెంచినాడ నర్సింహస్వామి (29) కొంతకాలం పనిచేసి మానేశాడు. తర్వాత సొంతూరుకు వెళ్లి అక్కడ వ్యాపారం చేసి మాసేసి మళ్లీ వచ్చి ఇదే కంపెనీలో చేరాడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన సింగలూరి సురేశ్‌ (26), ఇదే జిల్లాకు చెందిన నాగరాజు దొంగనోట్ల కేసులో గతంలో జైలుకి వెళ్లొచ్చారు. వీరిద్దరూ నర్సింహస్వామి స్నేహితులు. తరచూ వీరు హైదరాబాద్‌లో కలిసేవారు. నర్సింహస్వామి పెనుగొండ వెళ్లినప్పుడు ముగ్గురు కలిసి పార్టీ చేసుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందుల విషయం ప్రస్తావనకు వచ్చి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అలా తమ కంపెనీ యజమాని నాగేశ్వరరావు కుమారుడైన భానుప్రకాశ్‌ (20)ను కిడ్నాప్‌ చేద్దామని నర్సింహస్వామి చెప్పడంతో సురేశ్‌, నాగరాజు ఒప్పుకొన్నారు. కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసి ఒకవేళ ఇవ్వకపోతే చంపేయాలని కూడా అనుకున్నారు. తిరిగి నగరానికి వచ్చిన నర్సింహస్వామి ఫోన్‌ చేసి సురేశ్‌, నాగరాజును పిలిపించాడు. వారు భానుప్రకాశ్‌ను చూసి పెనుగొండ వెళ్లి కారు తెస్తామని, మరో ఇద్దరి సాయం తీసుకోవాలని అనడంతో నర్సింహస్వామి తనతోపాటే పనిచేస్తున్న బీదర్‌కు చెందిన ప్రశాంత్‌ (31), పనిచేసి మానేసిన బాబును ఈ పథకానికి ఒప్పించాడు.
బయటపడిందిలా.. గత ఏడాది అక్టోబరులో దీపావళికి వారం ముందు నర్సింహస్వామి ఫోన్‌ చేయడంతో సురేశ్‌, నాగరాజు కారులో హైదరాబాద్‌ వచ్చారు. అయిదుగురు కలిసి భానుప్రకాశ్‌ను కిడ్నాప్‌ చేసేందుకు కంపెనీ వద్దకు వెళ్లగా జనం కదలికలు, సీసీ కెమేరాలు ఉండటంతో ప్రణాళికను వాయిదా వేశారు. తర్వాత పెనుగొండకు తిరిగి వెళ్లిపోయిన సురేశ్‌, నాగరాజు.. మరో ప్లాన్‌ వేశారు. అసలు కిడ్నాప్‌ పథకాన్ని రచించిన నర్సింహస్వామికి తెలియకుండా గతనెల 26న హైదరాబాద్‌ వచ్చి నేరుగా కంపెనీకి వెళ్లి యజమాని నాగేశ్వరరావును కలిశారు. ఆ సమయంలో కంపెనీలో నర్సింహస్వామి లేకపోవడంతో ‘మీ కుమారుడిని కిడ్నాప్‌ చేసేందుకు మీ కంపెనీలో పనిచేసేవారే ప్రణాళిక వేశారని, వారి పేర్లు చెప్పాలంటే డబ్బులివ్వాల’ంటూ బేరసారాలకు దిగారు. దీనికి ఒప్పుకొన్న నాగేశ్వరరావు ఆ ఇద్దరి వివరాలు తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సురేశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఈ వ్యవహారమంతా బయటపడింది. దీంతో నర్సింహస్వామి, ప్రశాంత్‌ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాబు, నాగరాజు పరారీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని