Hide and seek : పాపం పసివాడు.. ఆటాడుకుంటూ దేశం దాటిపోయాడు!

ఆటలో మునిగిపోయి ఓ బాలుడు కంటైనర్‌లో దాక్కొని పరాయి దేశం వెళ్లాడు. అధికారుల చొరవతో దాదాపు 40 రోజుల తర్వాత స్వదేశం చేరుకున్నాడు. 

Updated : 01 Mar 2023 18:28 IST

(Image : Saifuddin Nasution twitter)

ఢాకా : చిన్నపిల్లలు పాఠశాలకు సెలవులొస్తే దొంగాపోలీస్‌, హైడ్‌ అండ్‌ సీక్‌(hide and seek) ఇలా రకరకాల ఆటలు ఆడుతుంటారు. అలా ఆటలో నిమగ్నమైపోయిన ఓ బాలుడు ఎవరికీ చిక్కకూడదనుకొని ఓ కంటైనర్‌లో దాక్కున్నాడు. దాన్ని ఓడలోకి ఎక్కించడంతో దేశం(country) దాటి.. పరాయిదేశం చేరుకున్నాడు. ఉన్నతాధికారులు జరిగిన తప్పిదాన్ని గుర్తించి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఎట్టకేలకు స్వదేశం చేరుకున్నాడు. దాంతో ‘పాపం పసివాడి’ కథ సుఖాంతం అయ్యింది. 

బంగ్లాదేశ్‌కు(Bangladesh) చెందిన బాలుడు ఎండీ రతుల్‌ ఇస్లామ్‌ ఫహిమ్‌ ఓ పోర్టు ఏరియాలో నివసిస్తున్నాడు. జనవరి 11న తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ సమీపంలోని కంటైనర్‌లో(container) దాక్కున్నాడు. దాంతో స్నేహితులు ఎంత వెతికినా దొరకలేదు. కంటైనర్‌లో సరకు లేకపోవడంతో పోర్టు సిబ్బంది దాన్ని పూర్తిగా తనిఖీ చేయలేదు. అలాగే క్రేన్‌ సహాయంతో ఓడలోకి ఎక్కించారు. ఆ ఓడ మెల్లగా రేవును వీడి మలేసియా(Malaysia) బయల్దేరింది. సముద్రమార్గంలో ప్రయాణం సాగిస్తూ జనవరి 17న మలేసియా చేరింది. ఆ తర్వాత కంటైనర్‌లో నుంచి చిన్న చిన్న శబ్దాలు రావడం గుర్తించిన ఓ ఉద్యోగి లోపల ఎవరో ఉన్నారని సహచరులకు చెప్పాడు. తలుపులు తీసి చూడటంతో ఫహిమ్‌ కనపడ్డాడు. అప్పటికే వారం రోజులు కావడంతో సరైన తిండి, నీరు లేక నీరసించి పోయాడు. లోపల వెలుతురు కూడా లేకపోవడంతో తన ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది.

ఈ విషయం తెలియడంతో మలేసియాలోని క్లాంగ్‌ జిల్లా అధికారులు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు, మెరైన్‌ పోలీసులు పోర్టు దగ్గర వాలిపోయారు. పిల్లవాడు బాగా బలహీనపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తొలుత ఫహిమ్‌ను మానవ అక్రమ రవాణా ముఠా తీసుకొచ్చిందేమోనని పోలీసులు(Police), అధికారులు అనుమానించారు. కానీ విచారణలో అందుకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదు. విచారణలో అక్రమ రవాణా కాదని తేలినట్లు అసిస్టెంట్ కమిషనర్‌ చా హూంగ్ ఫోంగ్‌ తెలిపారు. మలేసియా ఇంటీరియర్‌ మినిస్టర్‌ సైఫుద్దీన్‌ నసూషన్‌ బాలుడికి సంబంధించిన విషయాలను ట్వీట్‌ చేశారు. ఫహిమ్‌కు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందజేశామని, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అందుకు సహాయం చేశాయని చెప్పారు. బంగ్లాదేశ్‌ హై కమిషనర్‌తో మాట్లాడి చిన్నారిని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ‘దేవుడి దయతో బాలుడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నాడు. తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడని’ సైఫుద్దీన్‌ ఆనందం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని