Army Training: సైనికులకు పాములు తినే శిక్షణ!

ఏ దేశానికైనా సైనికులే రక్షణ. ఎంతమంది శత్రువులు దండెత్తినా.. వారితో వీరోచితంగా పోరాడి భద్రత కల్పించేది వాళ్లే. అందుకే వారికి అన్నింట్లో కఠినమైన శిక్షణ ఇస్తారు. 

Updated : 13 Nov 2021 09:56 IST

థాయ్‌లాండ్‌ నిర్వహిస్తోన్న ప్రత్యేక శిక్షణ శిబిరం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ దేశానికైనా సైనికులే రక్షణ. ఎంతమంది శత్రువులు దండెత్తినా.. వారితో వీరోచితంగా పోరాడి భద్రత కల్పించేది వాళ్లే. అందుకే వారికి అన్నింట్లో కఠినమైన శిక్షణ ఇస్తారు. అన్ని కాలాల్లో ఉష్ణోగ్రతను తట్టుకునేలా, అన్ని రకాల ఆయుధాలను వాడేలా తర్ఫీదు ఇస్తారు. కానీ థాయ్‌లాండ్‌ ప్రభుత్వం సైనికులకు విచిత్రంగా పాముల్ని, పురుగుల్ని పట్టుకొని తినడంలో శిక్షణ ఇస్తోంది. సైనికులు పాముల్ని తినడమేంటి?వాటిని పట్టుకోవడంలో శిక్షణేంటి?అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇది చదివేయండి..

సైనికులు వివిధ ప్రాంతాల్లో పహారా కాయాల్సి ఉంటుంది. అడవుల్లో, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి రావొచ్చు. లేదా యుద్ధంలో పోరాడుతూ అటవీ ప్రాంతంలోకి దారితప్పి వెళ్లొచ్చు. ఈ నేపథ్యంలో వారు ఆకలితో బాధపడకుండా ఉండాలంటే అడవుల్లో కనిపించే పాములు, పురుగులు, జంతువులను చంపి తినగలిగేలా థాయ్‌లాండ్‌ ప్రభుత్వం సైనికులకు శిక్షణ ఇస్తోంది. కేవలం ఆ దేశ సైనికులే కాదండోయ్‌.. విదేశీ సైనికుల కోసం ఏటా ‘కోబ్రా గోల్డ్‌ మిలటరీ డ్రిల్‌’ పేరుతో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. దాదాపు 27 దేశాలకు చెందిన సైనికులు ఇందులో పాల్గొంటున్నారు. థాయ్‌లాండ్‌, ఇండోనేషియాలో ప్రజలు పాముల్ని కూర వండుకున్నట్లుగా వండుకొని తింటారు. పాము రక్తం తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుందని గట్టిగా నమ్ముతారు. అందుకే ఈ శిక్షణ కార్యక్రమంలో సైనికులకు పురుగులు, జంతువులతోపాటు పాములను ఏ విధంగా పట్టుకోవాలి? వాటిలోని విషాన్ని ఎలా తొలగించి తినాలి?వంటి విషయాల్లో శిక్షణ ఇస్తుంటారు. పామును చంపిన తర్వాత వాటి రక్తాన్ని తాగమని కూడా సూచిస్తుంటారు.

1982 నుంచీ నేటిదాకా..

ఈ మిలటరీ శిక్షణను 1982లో అమెరికాతో కలిసి థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ శిక్షణ శిబిరంలో ఈ రెండు దేశాలతోపాటు సింగపూర్‌, దక్షిణ కొరియా, ఇండోనేషియా, జపాన్‌, మలేసియా దేశాలు ప్రధానంగా పాల్గొంటాయి. బ్రూనే, లావోస్‌, కాంబోడియా, ఇజ్రాయెల్‌, వియత్నాం, పాకిస్తాన్‌, శ్రీలంక, బ్రెజిల్‌, స్వీడెన్‌ దేశాలు శిక్షణ ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌, యూకే, నేపాల్‌, ఫిలిప్పీన్స్‌, ఫిజి, న్యూజిలాండ్‌ దేశాలు పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని