National Project : సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఏ ప్రాతిపదికన జాతీయ హోదా ఇస్తుందంటే..!

ఇటీవల కర్ణాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే ఏయే అంశాలను పరిశీలిస్తుందో తెలుసుకుందామా..

Published : 08 Feb 2023 17:45 IST

దేశంలో అనేక సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వాటిలో కొన్ని నిర్మాణ దశలో.. మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఒక రాష్ట్రం లేదా ప్రాంతం పురోగమించడానికి నీటిపారుదల ప్రాజెక్టులు(Irrigation Project) ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే వాటికి కేటాయించాల్సిన నిధులు కూడా భారీ మొత్తంలో ఉంటాయి. ఏదైనా ప్రాజెక్టుకు జాతీయహోదా(National Project) లభించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ సాయం అందుతుంది. ప్రాజెక్టు జరుగుతున్న పనులను కేంద్ర జలసంఘం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది.
దేశంలోని అత్యధిక జాతీయ ప్రాజెక్టులన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కింది. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ డిమాండు చేస్తున్న వేళ.. కర్ణాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు(cost) కేటాయించినట్లు మోదీ ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం నాలుగు అంశాలను పరిశీలిస్తుంది. అందులో ఏదో ఒక అర్హత కలిగి ఉంటే పరిగణలోకి తీసుకుంటుంది. అవేంటంటే..

1. అంతర్జాతీయ స్థాయిలో.. అంటే పొరుగు దేశంతోనైనా సరే కలిసి నిర్మించేలా ఆ ప్రాజెక్టు స్వరూపం ఉండాలి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నీటి వాటాను దేశం వాడుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఎక్కడ కడుతున్నారు? ఎప్పటిలోగా నిర్మాణం పూర్తవుతుంది అనే సమగ్ర సమాచారం ఉండాలి. దాంతో దేశీయ అవసరాలు తీరతాయి. ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలున్నాయని భావిస్తే కేంద్ర జలశక్తి శాఖ అందుకు తగ్గట్లుగా నిర్ణయం తీసుకుంటుంది. 

2. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల నీటి(water) అవసరాలు తీర్చే అంతర్‌ రాష్ట్రాల ప్రాజెక్టులు. రాష్ట్రాల మధ్య తగాదాల కారణంగా ఖర్చుల విభజన, పునరావాసం(rehabilitation), విద్యుత్‌ ఉత్పత్తి(power) అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్రం సమస్యను తీరుస్తుంది. పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చడం, వృథాగా నీరు సముద్రంలోకి కలవకుండా నదుల(rivers) అనుసంధానం కోసం చేపట్టే ప్రాజెక్టులు కూడా ఈ కోవలోకి వస్తాయి. 

3. ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే ఉండి.. ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే ప్రాజెక్టులు. రాష్ట్రంలోని ప్రజల సాగునీటి అవసరాలు తీర్చగలగాలి. ముఖ్యంగా రెండు లక్షల హెక్టార్లకు(hectare) మించి పొలాలకు సాగు నీరు అందించాల్సి ఉంటుంది. నీటి పంపకాల విషయంలో ఎలాంటి తగాదాలు ఉండకూడదు. ప్రాజెక్టులోని నీరు తిరిగి ప్రాజెక్టులో చేరే విధంగా ‘హైడ్రాలజీ’(hydrology) అనుకూలత కలిగి ఉండాలి.

4. విస్తరణ, పునర్నిర్మాణం, ఆధునికీకరణ(ఈఆర్‌ఎం) ప్రాజెక్టులు. అంటే అప్పటికే ఉన్న ఓ ప్రాజెక్టును పొడిగించడం లేదా పునరుద్ధరణ పనులు చేస్తే కనీసం 2 లక్షల హెక్టార్లకు నీరు అందించే స్థాయికి రావాలి. 

అనుమతులు.. అనుకూలతలు

పైన పేర్కొన్న అర్హతలు ఉంటే జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే అర్హత ఉన్నంత మాత్రం కేంద్రం అన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వదు. ఇంకా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. అవేంటంటే.. 

  • కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో ఆ ప్రాజెక్టు ఉన్నప్పుడు మాత్రమే జాతీయ హోదా సాధ్యమవుతుంది. 
  • సాగునీటి సలహా సంఘం ప్రాజెక్టు అనుకూలతల్ని పరిశీలిస్తుంది. దాని నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. 
  • వరద ముంపు నివారణ, బహుళసార్థక ప్రాజెక్టుల నిర్వహణ చూసే జలవనరుల శాఖ(డీవో డబ్ల్యూఆర్‌) ఆమోదం తెలపాలి.
  • నిర్దేశించిన ప్రమాణాలు ప్రాజెక్టులో ఉన్నాయని నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవనం(ఆర్డీ&జీఆర్‌) సంతృప్తి చెందాలి.
  • పెట్టుబడులకు తగిన అనుమతులు ఉండాలి. ప్రాజెక్టు కట్టొచ్చా లేదా అనే విషయంపై హైపవర్డ్‌ స్టీరింగ్‌ కమిటీ సిఫారసులు రావాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి నిధుల లభ్యత గురించి అంచనా వేయాలి.
  • ఇక జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రాలకు వాటా ఉంటుంది. కేంద్రం వాటా అన్ని రాష్ట్రాలకు స్థిరంగా ఉండదు. ఆయా ప్రాంతాల వెనుకబాటు ఆధారంగా ఎంత వాటా ఇవ్వాలన్న విషయంపై ఇదివరకే  కొన్ని ప్రమాణాలున్నాయి.

కేంద్రం 90: రాష్ట్రం 10..

8 ఈశాన్య రాష్ట్రాలు (అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం), 2 హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌), కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లకు ఈ నిష్పత్తి ప్రకారం వాటా నిధులు విడుదవుతాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు నిధుల పంపిణీ నిష్పత్తిలో తేడా ఉంటుంది. 

నీటిపారుదల కోసం కడుతున్న ప్రాజెక్టులే కాకుండా తాగునీటి అవసరాలు తీర్చడం కోసం కడుతున్న వాటికి కూడా జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అవకాశాలున్నాయి. తాగునీటి అవసరాలు తీరడం, నదులు, రిజర్వాయర్లు, కాలువల నుంచి వచ్చే నీరు భూమిలోపలి జలవనరుల శాతాన్ని పెంచుతూ చెరువులు నింపే ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి కేంద్రం అంగీకరించడం చాలా కష్టం అని నిపుణులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని