Awards for Modi: మోదీని వరించిన అంతర్జాతీయ అవార్డులివే..!

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీకి ఇప్పటివరకు 13 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. వీటితోపాటు పలు సంస్థలు కూడా ప్రత్యేక పురస్కారాలను ప్రకటించాయి.

Updated : 25 Jun 2023 19:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈజిప్టులో పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. ఆ దేశం అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ (Order of the Nile)ను ఇచ్చి సత్కరించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఇప్పటివరకు 13 అవార్డులు వచ్చినట్లయ్యింది. వీటితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు/ఫౌండేషన్లు కూడా తమ అవార్డులతో సత్కరించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిగా గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మోదీకి వచ్చిన అవార్డులను ఓసారి పరిశీలిస్తే..

ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌ : ఈజిప్టు అత్యున్నత పురస్కారమిది. దేశ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి అందజేసి సత్కరించారు. ఈజిప్టు సహా మానవాళికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా దేశాధినేతలు, ప్రముఖులకు ఈ అవార్డును అందజేస్తోంది.

కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ లొగోహు: పపువా న్యూ గిని అత్యున్నత పురస్కారం. పసిఫిక్‌ ఐలాండ్‌ దేశాల ఐక్యతతో పాటు ‘గ్లోబల్‌ సౌత్‌’ ప్రయోజనాల కోసం కృషికి గానూ ఈ అవార్డు దక్కింది. 2023 మేలో పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా దీన్ని ప్రదానం చేశారు.

కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజి: అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వానికి గుర్తింపుగా ఫిజి ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ ఏడాది మేలో అక్కడ పర్యటన సమయంలో ప్రధాని మోదీ దీన్ని అందుకున్నారు.

ఎబాకల్‌ అవార్డ్‌: పపువా న్యూ గిని పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సురంగెల్‌ ఎస్‌ విప్స్‌ జూనియర్‌ ‘ఎబాకల్‌ అవార్డు’తో సత్కరించారు. ఆ దేశంలో ఎంతో సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన ఈ అవార్డును అందుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రక్‌ గ్యాల్పో: భూటన్‌ అత్యున్నత పౌర పురస్కారం ఇది. దీనిని 2021లో భూటాన్‌ అందజేసింది. కరోనా సమయంలో అందించిన సహకారానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని ఇచ్చినట్లు ప్రకటించింది. 

లీజియన్‌ ఆఫ్‌ మెరిట్‌: అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు ఇది. సేవలు, ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తికి దీన్ని ప్రకటిస్తారు. 2020లో దీనిని అందుకున్నారు.

కింగ్‌ హమద్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది రనేసాన్స్‌: బహ్రెయిన్‌ పురస్కారం. 2019లో ఈ అత్యున్నత పురస్కారాన్ని గల్ఫ్‌ దేశం అందించింది.

ఆర్డర్‌ ఆఫ్‌ ది డిస్టింగ్విష్డ్‌ రూల్‌ ఆఫ్‌ నిషాన్‌ ఇజుద్దీన్‌: మాల్దీవులకు చెందిన అత్యున్నత పురస్కారం. దీన్ని 2019లో మాల్దీవుల ప్రభుత్వం అందజేసింది.

ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ: రష్యా అత్యున్నత పౌర పురస్కారం. 2019లో ఇచ్చారు.

ఆర్డర్‌ ఆఫ్‌ జయేద్‌: ఇది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని 2019లో అందుకున్నారు.

గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా: విదేశీ ప్రముఖులకు పాలస్తీనా ఇచ్చే అత్యున్నత పురస్కారం. 2018లో పాలస్తీనా ఈ అవార్డును అందజేసింది.

స్టేట్‌ ఆఫ్‌ ది ఘాజీ అమీర్‌ అమానుల్లా ఖాన్‌: అఫ్గానిస్థాన్‌ అత్యున్నత పౌర పురస్కారం. దీనిని 2016లో అందుకున్నారు.

ఆర్డర్‌ ఆఫ్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌: సౌదీ అరేబియా అత్యున్నత పురస్కారం ఇది. దీన్ని ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అందజేస్తుంది. 2016లో దీనిని ఇచ్చారు.

వీటితోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రధాని మోదీకి అవార్డులు ఇచ్చి సత్కరించాయి.

అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ రంగంలో ‘గ్లోబల్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లీడర్‌షిప్‌ అవార్డు’ను ప్రధాని మోదీకి కేంబ్రిడ్జి ఎనర్జీ రీసెర్చ్‌ అసోసియేషన్‌ (CERA) 2021లో అందించింది.

స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కార్యక్రమానికి సంబంధించి ‘గ్లోబల్‌ గోల్‌కీపర్‌’ అవార్డును బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ అందజేసింది.

పర్యావరణానికి సంబంధించి ఐరాస అందించే అత్యున్నత పురస్కారం ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ 2018లో వరించింది.

ప్రపంచ శాంతితో పాటు మానవాళి సామరస్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తులకు ‘సియోల్‌ పీస్‌ ప్రైజ్‌’ను అందజేస్తారు. 2018లో సియోల్‌ పీస్‌ ప్రైజ్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డును ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని