Soft drinks : 17 ఏళ్లుగా శీతల పానీయాలు తాగి బతుకుతున్నాడట!

ఇరాన్‌కు (Iran) చెందిన ఓ వ్యక్తి 2006 నుంచి ఘన ఆహార పదార్థాలు (Food)తీసుకోవడం మానేశాడు. అప్పటి నుంచి కేవలం శీతల పానీయాలు (Soft drinks)మాత్రమే తాగి జీవనం సాగిస్తున్నాడు. ఆ కథేంటో తెలుసుకోండి.

Updated : 19 May 2023 15:02 IST

ఇరాన్‌ (Iran) పౌరుడైన ఘోలమ్రేజా అర్దేశిరికి నిత్యం మనుషులు తింటున్న ఆహారం చూస్తే వికారం కలుగుతుందట. అందుకే గత 17 ఏళ్లుగా కేవలం నీరు, శీతల పానీయాలు (Soft drinks) తాగి జీవనం సాగిస్తున్నాడు. 2006లో ఒక నాటి రాత్రి అతడికి వింత అనుభవం ఎదురైంది. నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన తరువాత తన గొంతులో ఏదో ఉందన్న భావన కలిగింది. దాన్ని బయటకు తీద్దామని యత్నించినా సాధ్యపడలేదు. వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. అన్ని పరీక్షలు చేసిన తరువాత గొంతులో ఏమీ లేదని, ఏదో ఉన్నట్లు అనుభూతి చెందుతున్నావని అతడికి వైద్యుడు చెప్పారు. ఈ సమాధానంతో కుదుటపడని ఘోలమ్రేజా ఇతర వైద్యులను కూడా సంప్రదించాడు. కానీ, ఎవరూ తన రుగ్మతను రూపుమాపలేకపోయారు.

ఆహారం మానేశాడు!

సొంతంగా ఏం చేస్తే ఆ వ్యాధిని నయం చేసుకోవచ్చోనని అన్వేషించిన ఘోలమ్రేజా చివరికి ఆహారం తీసుకోవడం మానేశాడు. దాంతో అతడికి కొంత సాంత్వన లభించింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడి ఎదుట ఆహారం భుజించడం మానేశారు. ఒక వేళ పొరపాటున వేరెవరైనా తన కళ్లెదుట తింటుంటే మాత్రం జబ్బు మళ్లీ మొదటికొచ్చేదట.

ఆ రాత్రి వింత అనుభూతి!

తన రుగ్మత గురించి ఘోలమ్రేజా మాట్లాడుతూ ‘ఆ రాత్రి నాకు వింత అనుభూతి కలిగింది. నా నోట్లో వెంట్రుకలున్నట్లుగా తోచింది. తలపై ఎన్ని వెంట్రుకలుంటాయో అన్నీ నా నోట్లోనే ఉన్నట్లు.. అవి కడుపులోకి చేరినట్లు అనిపించసాగింది. దానికి పరిష్కారంగా ఏం చేయాలో తోచలేదని’ తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించారు. వెంట్రుకలు చుట్టుకుపోయి తన గొంతు పిసికేసినట్లుగా అనిపించిందని.. పిచ్చి పట్టినట్లుగా ఉండిందని ఆయన చెప్పారు.

ఈ వ్యాధిని నయం చేసుకోవడానికి ఘోలమ్రేజాకు తెలిసిన వారు వివిధ రకాల వైద్యుల పేర్లను సూచించారు. వారందరినీ కలిసినా ఆయనకు ఉపశమనం లభించలేదు. చివరికి తనకు పిచ్చి పట్టిందేమోనని కుటుంబ సభ్యులు మానసిక వైద్యుడి దగ్గరకు కూడా తీసుకెళ్లారు. కానీ, అక్కడా పరిష్కారం దొరకలేదు. అలా చివరి ప్రయత్నంగా ఆహారం తీసుకోవడం మానేసి.. శీతల పానీయాలు తాగడం మొదలుపెట్టాడు. దాంతో తక్షణ ఉపశమనం లభించింది. ప్రస్తుతం రోజంతా కలిపి మూడు పెద్ద శీతల పానీయాల సీసాలు ఖాళీ చేస్తున్నాడు. ఆ తరువాత తనకు ఆకలి కలుగదని ఘోలమ్రేజా చెబుతున్నాడు.

దినచర్యలో వివిధ రకాల శీతల పానీయాలు

ఘోలమ్రేజా విచిత్ర పరిస్థితి గురించి తెలిసి పలువురు మీడియా ప్రతినిధులు ఆయనను కలిశారు. తాను సోడా తాగిన తొలిసారి మునుపెన్నడూ లేని శక్తి లభించినట్లుగా అనిపించిందని వారికి చెప్పాడు. అందుకే వివిధ రకాల శీతల పానీయాలు తాగడం దినచర్యలో భాగం చేసుకున్నానని వివరించాడు. తాను ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకు 32 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. గత 17ఏళ్లుగా ఇంత భిన్నమైన అలవాటుతో జీవిస్తున్నప్పటికీ ఇంత వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నాడు. 

ప్రస్తుతం ఘోలమ్రేజా వయసు 58 సంవత్సరాలు. చక్కెర స్థాయి అధికంగా ఉండే శీతల పానీయాలు నిత్యం తాగితే ఏం జరుగుతుందనే విషయంపై ఆయనకు అవగాహన ఉంది. అయినా తనకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెబుతున్నాడు. తరచూ ఎండోస్కోపీ సహా ఇతర ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నా ఎలాంటి అసాధారణ ఫలితం రావడం లేదని వివరించాడు. ఘోలమ్రేజా కేవలం శీతల పానీయాలు కాకుండా వారానికి ఒక సారి సగం గ్లాసు నీరు, ఒక గ్లాసు టీ తాగుతున్నారు. రాత్రిపూట కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్ర వస్తుండటంతో మిగతా సమయం టీవీ చూస్తూ, పజిల్స్‌ ఛేదిస్తూ కాలం గడుపుతున్నాడు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని