ఆస్ట్రేలియాలో ‘మిస్టరీ ఫ్లైట్స్’!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం కుదేలైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. కొన్ని నెలలపాటు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలు కొనసాగిస్తూనే

Updated : 14 Mar 2021 20:15 IST

సిడ్నీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం కుదేలైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. కొన్ని నెలలపాటు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలు కొనసాగిస్తూనే దేశీయ ప్రయాణాలకు అనేక దేశాలు అనుమతులిచ్చాయి. అయినా ప్రయాణికులు లేక విమానయానరంగం నష్టాలను చవిచూస్తోంది. దీంతో ప్రభుత్వాల సహాయం కోరుతూనే ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు టికెట్‌ ధరలు తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటస్‌ అనే ఎయిర్‌లైన్‌ సంస్థ ఓ భిన్నమైన పద్ధతిని ఎంచుకుంది. ప్రయాణికుల్లో విమానయానంపై ఆసక్తి పెంచేందుకు ‘మిస్టరీ ఫ్లైట్‌’ పద్ధతిని అమలు చేస్తోంది.

ఏంటీ మిస్టరీ ఫ్లైట్‌?

సాధారణంగా విమాన ప్రయాణం చేయాలంటే మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో ఆ ప్రాంతానికి ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. కానీ, ‘మిస్టరీ ఫ్లైట్‌’ దేశీయ విమాన సర్వీసులో ప్రయాణికులు వారి గమ్యస్థానం ఏంటో చెప్పనక్కర్లేదు. అలాగే, విమానం కూడా ఎక్కడికి వెళ్తుందో సిబ్బంది చెప్పరు. టికెట్‌ కొనుగోలు చేసి విమానం ఎక్కి కూర్చుంటే.. అది ఎక్కడికి వెళ్తుందో, ఏ ఎయిర్‌పోర్టులో దిగుతుందో ప్రయాణికులెవరూ తెలుసుకోలేరు. ఈ ప్రయాణం వ్యవధి కనీసం రెండు గంటలు ఉంటుంది. ఈ రెండు గంటల ప్రయాణం ముగిసిన తర్వాత ఏ ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉంటే అక్కడే విమానాన్ని ల్యాండ్‌ చేస్తారు. మార్గం మధ్యలో సందర్శక ప్రాంతాలు వస్తే ప్రయాణికులు చూడటానికి వీలుగా విమానాన్ని భూమికి తక్కువ ఎత్తులో తీసుకెళ్తారట. మార్చి 4 నుంచే టికెట్‌ బుకింగ్‌ ప్రారంభం కాగా.. మార్చి 27, ఏప్రిల్‌ 18, మే 1 తేదీల్లో ప్రయాణాలు ఉంటాయి. బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధర 737 ఆస్ట్రేలియన్‌ డాలర్లు ఉండగా.. ఎకానమీ క్లాస్‌ టికెట్‌ ధర 577 ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా ఉంది.

గతేడాది ఇలాంటి ప్రయోగమే ‘ఫ్లైట్‌ టు నోవేర్‌’

లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలించిన తర్వాత క్వాంటస్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు విమానయానం చేసిన అనుభూతి కల్పించడం కోసం గతేడాది ‘ఫ్లైట్‌ టు నోవేర్‌’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. విమానాలు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లే వీలు లేకపోవడంతో ప్రయాణికులను ఒక ఎయిర్‌పోర్టులో ఎక్కించుకొని దాదాపు ఏడు గంటలు గాల్లోనే తిప్పుతూ ఆస్ట్రేలియాలోని ప్రముఖ సందర్శక ప్రాంతాలను చూపించి తిరిగి మళ్లీ అదే ఎయిర్‌పోర్టులో విమానాన్ని దింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని