Adventure travel : ‘777 చార్లీ’ సినిమా కథలా సాగింది వీరి లద్దాఖ్‌ ప్రయాణం

బైక్‌పై ఒక్కరు కూర్చొని దూర ప్రయాణం చేయడానికే ఓపిక ఉండదు. అలాంటిది ఓ వ్యక్తి తన పెంపుడు శునకంతో దిల్లీ నుంచి లద్దాఖ్‌ వరకు ప్రయాణం సాగించాడు. ఆ సాహస యాత్ర కథేంటో తెలుసుకోండి. 

Published : 05 Feb 2023 15:43 IST

(Image : instagram)

‘777 చార్లీ’.. ఇటీవలి కాలంలో వచ్చిన ఈ  సినిమా కథ మొత్తం ఓ శునకం నేపథ్యంలో సాగుతుంది. అందులో కుక్కకు మంచు అంటే చాలా ఇష్టం. దాంతో బైక్‌పై కథానాయకుడు, కుక్క కలిసి ప్రయాణం చేస్తూ మంచు కురిసే ప్రాంతానికి చేరుకుంటారు. 

సరిగ్గా అలాంటి ప్రయాణమే(trip) చేస్తూ ఇటీవల సామాజిక మాధ్యమాల దృష్టిని ఆకర్షించాడు చౌ సురేంగ్ రాజ్‌ కన్వార్. తన పెంపుడు శునకం(dog)తో ఇటీవల దిల్లీ నుంచి లద్ధాఖ్‌ వరకు ప్రయాణించాడు. ప్రపంచంలోనే ఎత్తయిన మోటారబుల్‌ రోడ్‌ ఉమ్లింగ్‌ లాను చేరుకొని తన పెట్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. 

ఎవరీ చౌ సురేంగ్‌?

చౌ సురేంగ్ రాజ్‌ కన్వార్‌(Chow Sureng Rajkonwar) అస్సాం రాష్ట్రంలో జన్మించాడు. అతని అమ్మ తనను డాక్టర్‌గా చూడాలనుకుంది. కానీ చౌకు చిన్నప్పటి నుంచే బైక్‌ రైడింగ్‌పై ఇష్టం ఏర్పడింది. ఐదో తరగతి నుంచి స్కౌట్‌గా ఉంటూ హైకింగ్‌, క్యాంపింగ్‌కు వెళ్లే వాడు. 16 ఏళ్ల వయసులో ఉండగా చౌ తండ్రిని కొందరు హత్య చేశారు. దాంతో కుటుంబాన్ని పోషించేందుకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదివి కొన్నాళ్లు మోడలింగ్‌ రంగంలో ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూనే 2011 నుంచి వారాంతాల్లో బైక్‌ రైడ్‌ చేయడం, ఆ విశేషాలను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచడం మొదలుపెట్టాడు.

అయితే తాను చేస్తున్న ఉద్యోగం సురేంగ్‌కు సంతృప్తి ఇవ్వలేదు. ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తూ తరచూ ట్రావెల్‌ వ్లాగ్‌లు చేయడం ఆరంభించాడు. గతంలో తీసిన వీడియోలన్నీ ఒక్కొక్కటిగా యూట్యూబ్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టాడు. దాంతో నెటిజన్ల నుంచి ఆదరణ లభించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆ వీడియోలు సురేంగ్‌కు ఆర్థికంగా ఎంతగానో తోడ్పాటునందించాయి.

(Image : instagram)

‘బెల్లా’ను దత్తత తీసుకొని..

ఫొటోగ్రఫీ, బైక్‌రైడ్‌, ట్రావెలింగ్‌ను అమితంగా ఇష్టపడే సురేంగ్‌కు మూగజీవాలంటే(pets) అమిత ప్రేమ. దాంతో 2021 డిసెంబరు 16న బెల్లా అనే బుజ్జి కుక్క పిల్లను దత్తత తీసుకున్నాడు. దానికి ఐదు నెలల వయసు రాగానే రైడ్‌కు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అలా తొలిసారి అస్సాంలోని దిబ్రూగఢ్‌(Dibrugarh)నుంచి దిల్లీ వరకు 2,500 కిలోమీటర్ల మేర యాత్ర (journey)పూర్తి చేశాడు. ఆ యాత్ర విశేషాలు నెటిజన్ల దృష్టిని మరింతగా ఆకర్షించాయి. అలా... అరుణాచల్‌ ప్రదేశ్‌లో సూర్యుడు ఉదయించే తొలి గ్రామం డోంగ్‌(Dong) మొదలుకొని లద్ధాఖ్‌లోని ఎత్తయిన రోడ్డు మార్గం ఉమ్లింగ్‌ లా వరకు వీరి ప్రయాణం సాగింది. ఇప్పటిదాకా బెల్లా, సురేంగ్‌ కలిసి దాదాపు 9వేల కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేశారు.

కుక్కకు శిక్షణ ఎలా..

బెల్లాకు మొదట్లో చిన్న చిన్న రైడ్‌లు అలవాటు చేశాడు. ఒక రైడ్‌ పూర్తవగానే దానికి ఆహారం ఇవ్వడం, ఆరోగ్యాన్ని పరీక్షించడం మొదలు పెట్టాడు. క్రమంగా కలిసి దగ్గర్లోని ప్రదేశాలను చుట్టిరావడం ప్రారంభించారు. అవి 50-100 కిలోమీటర్ల లోపే ఉండేలా సురేంగ్‌ జాగ్రత్తలు తీసుకున్నాడు. బైక్‌పై బెల్లా సౌకర్యంగా కూర్చోవడానికి సీటును డిజైన్‌ చేయించాడు. కిందపడకుండా చుట్టూ రక్షణ ఏర్పరిచాడు. బెల్లాకు సైతం హెల్మెట్‌, కళ్లద్దాలు పెట్టేశాడు. అయితే ప్రయాణం మధ్యలో కొన్నిసార్లు ఇతర జంతువులను చూసి బెల్లా బైక్‌పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో దానికి ఎలాంటి గాయాలు కాలేదు. అప్పటి నుంచి బెల్లా కదలికలను గమనిస్తూ సురేంగ్‌ తమ ప్రయాణానికి విరామం ఇస్తుంటాడు.

త్వరలో వీధి కుక్కలకు ఆహారం అందించడం కోసం నిధుల సేకరణే లక్ష్యంగా బెల్లా, సురేంగ్‌ కలిసి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు రైడ్‌ చేయబోతున్నారు. వారి జర్నీకి ఆల్‌ ద బెస్ట్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు