UPSC : సివిల్‌ సర్వెంట్లను అందిస్తోన్న ‘యూపీఎస్సీ’ ఎలా ఏర్పడిందంటే..?

ఏటా సుమారు పది లక్షల మంది యూపీఎస్సీ (UPSC) నిర్వహించే పరీక్షలు రాస్తున్నారు. అర్హత సాధించిన వారు ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌), ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) తదితర సర్వీసుల్లో నియమితులవుతున్నారు. 

Updated : 24 May 2023 16:13 IST

అఖిల భారత సర్వీసుల్లో (Indian civil service) నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌-2022 తుది ఫలితాలు (Results) తాజాగా విడుదలయ్యాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) గత కొన్ని దశాబ్దాలుగా కట్టుదిట్టంగా నిర్హహిస్తోంది. అసలు యూపీఎస్సీ ప్రస్థానం ఎలా మొదలైందో చదివేయండి.

బ్రిటిష్‌ హయాంలోనే అడుగులు

1854లో బ్రిటిష్‌ ప్రభుత్వం సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అదే యూపీఎస్సీ పుట్టుకకు కారణమైంది. అంతకుముందు భారత్‌లో పని చేసే సివిల్‌ సర్వెంట్లను ఈస్టిండియా కంపెనీ నామినేట్‌ చేసేది. వారికి లండన్‌లోని హేలిబరీ కళాశాలలో శిక్షణనిచ్చేవారు. తరువాతి కాలంలో లార్డ్‌ థామస్‌ మెకాలే నివేదికను అనుసరించి నామినేషన్లకు బదులుగా పోటీ పరీక్షలు నిర్వహించాలని తీర్మానించారు. దాంతో సివిల్ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటైంది. అప్పట్లో పరీక్ష లండన్‌లో మాత్రమే జరిగేది. 1863లో సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఈయన విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సోదరుడు. 1922 తర్వాత నుంచి ఈ పరీక్షను భారత్‌లోనే నిర్వహిస్తున్నారు. అప్పటికి తొలి ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. 

స్వతంత్ర భారత్‌లో..

సివిల్‌ సర్వీసెస్‌ విధి విధానాల రూపకల్పన కోసం భారత ప్రభుత్వ చట్టం 1919లోనే అడుగులు పడ్డాయి. 1926 అక్టోబర్‌ 1న పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను భారత్‌లో ఏర్పాటు చేశారు. 1937లో ఈ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌గా మార్పు చెందింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌గా అవతరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 378లోని క్లాజ్‌(1) ప్రకారం ఆ మార్పు జరిగింది. అఖిల భారత సర్వీసుల పితామహుడిగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను సంబోధిస్తారు. 1947లోనే ఐఏఎస్‌, ఐపీఎస్‌ సర్వీసులు ఏర్పాటు కాగా.. 1966లో ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్‌ ఏర్పాటు చేశారు.

యూపీఎస్సీ చేసే అన్ని ఖర్చులూ సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. యూపీఎస్సీ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.  ప్రభుత్వంలో వివిధ సేవల కోసం రిక్రూట్‌మెంట్‌ నిబంధనలను రూపొందిస్తుంది. అవసరమైతే వాటిని సవరిస్తుంది. సివిల్‌ సర్వీసెస్‌కు సంబంధించిన క్రమశిక్షణ కేసులు చూస్తుంది. భారత రాష్ట్రపతి కమిషన్‌కు సూచించిన ఏదైనా విషయంపై ప్రభుత్వానికి సలహా ఇస్తుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని