టీకాతో పూర్తి రక్షణే..కానీ..!

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు వైరస్‌ వల్ల కలిగే తీవ్ర జబ్బు నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ..ఇదే సమయంలో టీకా తీసుకున్న వారికి వైరస్‌ లక్షణాలుంటే వారినుంచి ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Published : 12 Apr 2021 19:16 IST

వీరినుంచి ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం
హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేవరకు జాగ్రత్తలు తప్పనిసరి - నిపుణులు

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు వైరస్‌ వల్ల కలిగే తీవ్ర జబ్బు నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ..ఇదే సమయంలో టీకా తీసుకున్న వారికి వైరస్‌ లక్షణాలుంటే వారినుంచి ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. అందుచేత టీకా తీసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు.

‘కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఉన్న వ్యూహాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఓ సాధనం మాత్రమే. అయినప్పటికీ మహమ్మారిని పూర్తిగా ఎదుర్కోవడంలో ఇదో అద్భుతమైన పరిష్కారం కాదు’ అని దిల్లీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఇమ్యూనాలజిస్ట్‌ సత్యజిత్‌ రథ్‌ తెలిపారు. ‘వ్యాక్సిన్‌ తీసుకోని వారితో పోల్చితే టీకా తీసుకున్న వారిలో ఇన్‌ఫెక్షన్‌ తక్కువగానే ఉంటుంది. కొత్తగా వెలుగుచూస్తోన్న కరోనా వైరస్‌ల వ్యాప్తిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు నిరోధించలేవు. దీంతో కొత్తరకాల వల్లే కలిగే ఇన్‌ఫెక్షన్‌ ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది’ అని పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌కి చెందిన ఇమ్యూనాలజిస్ట్‌ వినీతా బాల్‌ పేర్కొన్నారు.

వైరస్‌ వ్యాప్తికి కారణాలివే..

కమ్యూనిటీ స్థాయిలో కొవిడ్‌ కట్టడి చేయడంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దోహదం చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల వ్యక్తిగతంగా పూర్తి రక్షణ కలుగుతుంది. కానీ, వారు కొవిడ్‌ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే మరోసారి కరోనా బారినపడే అవకాశం ఉంటుంది. తొలుత వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రోగనిరోధకత కొన్నిరోజుల తర్వాత తగ్గిపోవడం ఇందుకు ఒక కారణమైతే.. వివిధ కొత్త రకాల వైరస్‌లు వెలుగుచూడడం మరో కారణం’ అని ఇమ్యూనాలజీ నిపుణులు డాక్టర్‌ సత్యజిత్‌ రథ్‌ విశ్లేషిస్తున్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేవరకూ వైరస్‌ కట్టడికి ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గర్భిణిలు, చిన్నారులకు ఇచ్చే టీకాల కోసం ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్న నేపథ్యంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ ఇప్పట్లో సాధించడం కూడా కష్టమేననే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

రోగనిరోధకత కోల్పోవడమూ మరో కారణం..

‘కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇవి కల్పించే రోగనిరోధకత ఎన్ని నెలలు ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అందుచేత ముందస్తుగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొన్ని నెలల తర్వాత వ్యాధినిరోధకత కణాలు వాటి మెమొరీని కోల్పోతాయి. దీంతో అలాంటి వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది’ అని వినీతా బాల్‌ పేర్కొన్నారు. అందుచేత వ్యాక్సిన్‌ తీసుకున్న వారుకూడా మాస్కులు, భౌతిక దూరం వంటి కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి వ్యాక్సిన్‌ ఏ మేరకు రక్షణ కల్పిస్తుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారినుంచి ఇన్‌ఫెక్షన్‌ ఇతరులకు వ్యాపిస్తుందా? అన్న కోణంలో అధ్యయనాలు కొనసాగుతున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో లక్షణాలున్నట్లయితే వారినుంచి మరొకరికి ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారుకూడా మాస్కులు, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. మెజారిటీ ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేంత వరకూ ఈ జాగ్రత్తలు పాటించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని