13 మంది సాహసం: గ్రామం కోసం కొండలో సొరంగం!

ప్రాచీన కట్టడాలను చూసి ఔరా అనుకుంటాం.. ఎలాంటి టెక్నాలజీ లేని శతాబ్దాల కిందట కొండలపై కోటలు నిర్మించిన తీరు చూసి ఆశ్చర్యపోతాం. కానీ, పూర్తిగా టెక్నాలజీ అందుబాటులో ఉన్న 20వ శతాబ్దంలోనూ ఓ గ్రామస్థులు కేవలం ఉలి, సుత్తి సాయంతో 1.2కిలోమీటర్ల మేర కొండలో సొరంగ మార్గం ఏర్పాటు

Published : 30 Jul 2021 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రాచీన కట్టడాలను చూసి ఔరా అనుకుంటాం.. ఎలాంటి టెక్నాలజీ లేని శతాబ్దాల కిందట కొండలపై కోటలు నిర్మించిన తీరు చూసి ఆశ్చర్యపోతాం. కానీ, పూర్తిగా టెక్నాలజీ అందుబాటులో ఉన్న 20వ శతాబ్దంలోనూ ఓ గ్రామస్థులు కేవలం ఉలి, సుత్తి సాయంతో 1.2కిలోమీటర్ల మేర కొండలో సొరంగ మార్గం నిర్మించారు. దీంతో ఆధునిక కాలంలో అసాధారణ నిర్మాణంగా గుర్తింపు పొందిన ఈ కొండపై రోడ్డు పర్యటక ప్రాంతంగా మారిపోయింది.

గావులియంగ్‌.. చైనాలోని తైహాంగ్‌ పర్వత ప్రాంతంలో ఉన్న గావులియంగ్‌ కొండపై ఉన్న చిన్న గ్రామం. సముద్రమట్టానికి 1,700 మీటర్ల ఎత్తులో... ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు నిత్యావసర వస్తువులు ఏవైనా తెచ్చుకోవాలంటే కొండకు వేలాడదీసిన పురాతనమైన 720 మెట్ల నిచ్చెనను ఆశ్రయించాల్సిందే. గ్రామంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే.. ఎనిమిది మంది సాయంతో బాధితుడిని కిందకి దించాల్సి వచ్చేది. ఇందుకు చాలా సమయం పట్టేది. అంత కష్టపడి కిందకి దించినా.. నాలుగు గంటలు ప్రయాణిస్తే కానీ, ఆస్పత్రి ఆచూకీ కానరాదు. పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకెళ్లడానికి వీలు లేక ఆర్థికంగా నష్టపోయేవారు. మూడు దశబ్దాల కిందటి వరకూ గావులియంగ్‌ గ్రామస్థులు ఇలాంటి దుర్భర పరిస్థితులనే ఎదుర్కొన్నారు. అయితే, 1972లో గ్రామంలోని పదమూడు మంది తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్ని పూర్తిగా మార్చేసింది.

13 మందితో మొదలై..

తమ గ్రామం నుంచి సమీప నగరానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఆ ఊరి ప్రజలు ప్రభుత్వానికి ఎంత విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 1972లో ఊరిలోని పదమూడు మంది యువకులు తామే కొండలో సొరంగ మార్గం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించేంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఉలి, సుత్తితో కొండ అంచులో సొరంగం తొవ్వడం మొదలుపెట్టారు. ఎంత శ్రమించినా ఒక మీటరు సొరంగానికి మూడు నెలల సమయం పట్టేది. అయినా, వారు వెనకడుగు వేయలేదు. మరింత కసిగా పనిచేయడం ప్రారంభించారు. వారి దృఢ సంకల్పాన్ని చూసి గ్రామంలోని మరికొందరు సాయంగా వచ్చారు. దీంతో బలం, పనితనం పెరిగింది. అలా ఐదేళ్లు శ్రమించి కొండపై నుంచి కిందకి 1.2కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించారు. 

ప్రపంచానికి తెలిసింది అప్పుడే..

కొండపై రోడ్డు కనిపించడంతో అక్కడో గ్రామం ఉందన్న విషయం అప్పుడే ప్రపంచానికి తెలుసొచ్చింది. కొండ అంచుల్లో సొరంగ మార్గంలో సాహస ప్రయాణం చేయడానికి ఇష్టపడేవారు ఈ గ్రామానికి క్యూ కట్టారు. అలా.. ఈ గ్రామం సందర్శక ప్రాంతంగా మారింది. గ్రామస్థులకు పంటలపై వచ్చే ఆదాయమే కాకుండా.. పర్యటకంగానూ ఆదాయం లభిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని