Amaravati: ఏపీలో 14 లక్షల ఫిర్యాదులు.. 5.6 లక్షల ఓట్ల తొలగింపు: ఏపీ సీఈవో

ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

Updated : 22 Jan 2024 19:50 IST

అమరావతి: ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా అనంతరం 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు సైతం 5 లక్షల మేర పెరిగారని వెల్లడించారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ఆగస్టు 2023లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలో రెండు ప్రధాన సమస్యలు వారి దృష్టికి వచ్చాయి. తప్పుడు అడ్రస్‌లు, అసలు చిరునామా లేకుండా, ఒకే ఇంట్లో పదికి మించి ఓటర్లు ఉండటం.. ఇలా పలు సమస్యలు వారి దృష్టికి వచ్చాయి. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. చిరునామా లేకుండా 2.51 లక్షల మంది ఉన్నట్లు గుర్తించాం. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.51 లక్షల ఇళ్లను తనిఖీ చేసి 25లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించాం. కొన్నిచోట్ల ఒకే చిరునామాతో 700మందికిపైగా ఉన్నారు. ఈ సమస్యను 98 శాతం మేర సరిచేశాం. కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయిలో సవరణ చేయలేకపోయాం. 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయి. వాటిని పరిశీలించి 5.6 లక్షల ఓట్లను తొలగించాం.

కొందరు దురుద్దేశపూర్వకంగా ఫారం-6, ఫారం-7 నమోదు చేశారు. అలాంటివారిపై 70 కేసులు నమోదు చేశాం. కొత్త దరఖాస్తులపైనా సమీక్ష చేస్తాం. 80 ఏళ్ల వయసు పైబడిన వారి ఇళ్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఈ తరహా ఓటర్లు రాష్ట్రంలో 4.70 లక్షల మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు అభ్యంతరాలపై సీఈఓ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. ఓటరు తుది జాబితాను అన్ని పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతాం’’ అని ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని