Viveka murdercase: తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించండి.. అవినాష్‌రెడ్డి పిటిషన్‌

తనను సీబీఐ అధికారులు విచారించే సమయంలో ఆడియో, వీడియో చిత్రీకరణ జరిపేలా ఆదేశించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌లో కోరారు.

Updated : 09 Mar 2023 16:37 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో రేపు ఉదయం 11 గంటలకు సీబీఐ ఎదుట విచారణకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు విచారించే సమయంలో ఆడియో, వీడియో చిత్రీకరణ జరిపేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని, సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం ప్రతిని ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘‘వివేకా హత్యకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకు సీబీఐ అరెస్టు చేయలేదు. దస్తగిరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదు. దస్తగిరి అక్కడ.. ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోంది. నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. వివేకా హత్యకేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉంది. వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని .. అదే కోణంలో విచారణ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. నేను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారు’’ అని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని