స్పష్టమైన అవగాహనతోనే వ్యతిరేకిస్తున్నాం: కేసీఆర్‌

సీఏఏకి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించారు. కొన్ని నెలలుగా దేశంలో సీఏఏకి సంబంధించి వాదోపవాదాలు

Updated : 16 Mar 2020 13:27 IST

సీఏఏకి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం

హైదరాబాద్‌ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించారు. కొన్ని నెలలుగా దేశంలో సీఏఏకి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయని వివరించారు. దేశంలో చాలా పరిణామాలు సంభవించాయని పేర్కొన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా లౌకికవాదులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు.

‘పార్లమెంట్‌లో సీఏఏ బిల్లును మేం వ్యతిరేకించాం. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మన వైఖరేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన అవగాహనతోనే మేం సీఏఏ,ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తున్నాం. స్వయంగా అమెరికా అధ్యక్షుడు దేశ రాజధానిలో పర్యటిస్తున్న సమయంలో అల్లర్లు జరిగాయి.’

‘నాకే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదు. మా నాన్నది తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలి. ఈ దేశంలో కోట్లాది మంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు. నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?. దేశంలో ఓటింగ్‌ జరుగుతోంది.. ఓట్లతోనే ఎవరైనా అధికారంలోకి వస్తాం. ప్రతీ ఒక్కరికి ఓటు ఐడీ కార్డు ఉంటుంది. ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు పనిచేయదని ఎలా అంటారు?’

‘సీఏఏని మేధావులు, కవులు, నిపుణులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. సీఏఏకి వ్యతిరేకంగా కొంత మంది అవార్డులను తిరస్కరిస్తున్నారు. విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా?. ప్రతి ఒక్కరికి పౌరసత్వం ఉండాల్సిందే. చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరు. మెక్సికో వాసులు రాకుండా అమెరికా గొడనే కట్టింది. భారతదేశంలో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా?. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహీ, పాకిస్థాన్‌ ఏజెంట్‌అంటూ విమర్శలు చేస్తున్నారు.’ అని కేసీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని