ప్రచారంపై నిషేధం కొనసాగుతోంది:ఏపీ ఎస్‌ఈసీ

స్థానిక ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని.. ప్రస్తుత సంధికాలంలో ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు

Published : 06 Apr 2020 17:41 IST

అమరావతి: స్థానిక ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని.. ప్రస్తుత సంధికాలంలో ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు వారి స్వప్రయోజనాల కోసం ప్రచారం..ఓటర్లను ప్రభావితం తదితర చర్యలు చేయకూడదన్నారు. అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై క్షేత్రస్థాయి అధికారులు దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు. నిజానిజాలను విచారించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు ఆయన లేఖ రాశారు.

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజల మద్దతు కోరుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని రమేశ్‌కుమార్‌ చెప్పారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ విషయాలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి నగదు సాయం పంపిణీ తీరుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. నగదు పంపిణీ చేసే సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈక్రమంలో భాజపా, సీపీఐ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఈసీ స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని