Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Aug 2023 09:18 IST

1. చెత్త కుప్పల్లో కాసుల వేట!

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో నిత్యం సేకరించే చెత్తను వేసే యనమదుర్రు కాలువ గట్టు ఇది. ఈ చెత్త సర్దడానికి వినియోగించే యంత్రాలు ఒక్క రోజులోనే 100 లీటర్లు తాగేస్తున్నాయట. ఒకట్రెండు రోజులు కాదు ఈ నెల ఆరంభం నుంచి ఇలా వేల లీటర్ల డీజిల్‌ ఖర్చయినట్లు లెక్క చూపుతున్నారు. ఎన్ని గంటల పాటు చెత్తను సర్దితే ఇంత ఇంధనం ఖర్చవుతుందనే దానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇదేం బాగోతం.. గోరంత ఇచ్చి.. కొండంత ప్రచారం

కావలి పట్టణం జనతాపేటకు చెందిన ఓ వ్యక్తికి వైఎస్‌ఆర్‌ కాపునేస్తం ఇచ్చినట్లు కరపత్ర పుస్తకంలో చూపించారు. తాను ఆ సామాజిక వర్గం కాకున్నా.. తన పేరు అందులో ఉందని ఆ వ్యక్తి నివ్వెరపోతున్నారు. కావలి పురపాలక పరిధిలోని 29వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. తాను అలా ఎప్పుడూ అనారోగ్యంతో చికిత్స పొందలేదని చెప్పుకొస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మల్కాజిబరిలో ఎవరో!

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి శాసనసభా స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు భారాస అధిష్ఠానం మళ్లీ టికెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మైనంపల్లి.. మంత్రి హరీశ్‌రావుపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఆ పార్టీ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మైనంపల్లి స్థానంలో మరొకరిని ఈ స్థానం నుంచి బరిలో నిలపాలని పార్టీ యోచిస్తోందని చెబుతున్నారు. ఇదే జరిగితే టికెట్‌ ఎవరికి దక్కుతుందన్న దానిపై పలు ఊహాగానాలు నెలకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఫీజుల లెక్కలు చెప్పాల్సిందే

ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఏ పాఠశాలలో.. ఏ తరగతికి.. ఎంత మొత్తం ఫీజు వసూలు చేస్తున్నారనే సమాచారాన్ని ఇక నుంచి కచ్చితంగా తెలపాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది. ఈ వివరాలు సమగ్రంగా సేకరించడంతోపాటు వాటిని జిల్లాలు, పాఠశాలలు, తరగతుల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని నిర్ణయించింది. ఈ మేరకు డీఈఓలను ఆదేశించడంతో వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గుండె ఆగడానికి ముందు హెచ్చరిక సంకేతాలు ఇలా..

ఆసుపత్రి బయట గుండె ఆగిపోయిన (కార్డియాక్‌ అరెస్ట్‌) కేసుల్లో 90 శాతం ఆకస్మిక మరణానికి దారితీస్తాయి. దీనికి ముందు కనిపించే లక్షణాల్లో కొన్ని స్త్రీపురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తేల్చింది.  స్త్రీలు కార్డియాక్‌ అరెస్ట్‌కు ముందు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారని, పురుషులకైతే ఛాతీ నొప్పి వస్తుందని అధ్యయనంలో తేలింది. అమెరికాలోని సీడర్స్‌ సినాయ్‌ వైద్య కేంద్రానికి చెందిన స్మిట్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ అధ్యయనం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నేను అధ్యక్షుడినైతే.. మస్క్‌ను సలహాదారుగా నియమిస్తా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి గత శుక్రవారం అయోవాలోని టౌన్‌హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా గెలిస్తే- టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తానని అన్నారు. ‘గతేడాది ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌ ఎక్స్‌ పేరుతో దాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఆయన ట్విటర్‌ను నడుపుతున్న మాదిరిగా నేను ప్రభుత్వాన్ని నడిపిస్తాను’ అని రామస్వామి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ కొరియోగ్రాఫరే.. ఈ అందాల రాణి!

‘నాణ్యమైన విద్యను అందుకోవడం ప్రతి అమ్మాయీ హక్కు.. సామాజిక కట్టుబాట్ల పేరుతో దాన్ని కాలరాయొద్దు..’ అంటోంది 22 ఏళ్ల శ్వేత శార్దా. నాన్న ప్రేమకు దూరమై.. అమ్మ ఆలనలోనే పెరిగిన ఆమె.. ఉన్నత విద్యనభ్యసించే క్రమంలో పలు ఆర్థిక కష్టాల్ని ఎదుర్కొంది. మరెవరికీ ఇలాంటి సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో.. ప్రస్తుతం బాలికా విద్యపై అవగాహన కల్పిస్తోంది. డ్యాన్స్‌పై మక్కువతో పలు టీవీ షోలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఆమె..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏఐతో క్యాన్సర్ల అంచనా

ఇటీవల కొన్నిరకాల అన్నవాహిక, జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువవుతున్నాయి. ఈసోఫేగల్‌ అడినోకార్సినోమా (ఈఏసీ), గ్యాస్ట్రిక్‌ కార్డియా అడినోకార్సినోమా (జీసీఈ) బారినపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే నివారణ పద్ధతులతో వీటిని తగ్గించుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకు ముందస్తు పరీక్షలు (స్క్రీనింగ్‌) బాగా ఉపయోగపడతాయి. జీర్ణాశయ రసాలు గొంతులోకి ఎగదన్నుకొని వచ్చే (జీఈఆర్‌డీ) సమస్యతో దీర్ఘకాలంగా బాధపడేవారిలో బారెట్స్‌ ఈసోఫేగస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుంది!

‘భారత ఉప ఖండంలో  అక్టోబరు- నవంబరులో జరిగే ఐసీసీ 2023 ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్‌ తప్పనిసరిగా ఫేవరేట్‌ జట్టే. ఈ సారి ప్రపంచ కప్పు గెలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి భారతీయుడి ఆశ అదే’ అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ అన్నారు.  త్వరలో ప్రారంభమయ్యే పోటీలకు ఇప్పటికే భారత్‌ జట్టు సిద్ధంగా ఉందన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈ మహిళ చిరంజీవి..

పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొస్తున్న రైలును చూసి ఆమె మెదడు మొద్దుబారిపోయింది. రైలు ఇక తన వద్దకు వచ్చేస్తున్న తరుణంలో పట్టాలపై ముడుచుకుని పడుకుని ఆ మహిళ ప్రాణాలను రక్షించుకున్నారు. బెంగళూరు యలహంక సమీపంలోని రాజానుకుంటె రైల్వేస్టేషన్‌ వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని