
AP News: సేవే అసలైన మతం: ఉప రాష్ట్రపతి వెంకయ్య
వెంకటాచలం: దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో.. సేవాలయానికి వెళ్తే అంతే పుణ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవాల్లో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్షాతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. ‘‘స్వర్ణభారత్ ట్రస్టును పరిశీలించాలని చాలా మందిని ఆహ్వానిస్తుంటా. ఏ పదవిలో ఉన్నా ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటా. స్వర్ణభారత్ ట్రస్టు ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఉంది. తెలుగు భాష రక్షణ కోసం ట్రస్టు ప్రయత్నిస్తోంది. గ్రామీణ మహిళలకు ఒకేషనల్ కోర్సుల కోసం కొత్త భవనం అందుబాటులోకి తెచ్చాం. దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నాం.
అన్నదాతలైన రైతులపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలు. యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలి. వారికి తగినంత ప్రోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. మహిళలు ఇంకా చాలా అంశాల్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలన్నదే నా ఆకాంక్ష. మాతృభాష, మాతృభూమిని మర్చిపోవద్దు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి. సొంత ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అని వెంకయ్య అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.