Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 May 2023 16:57 IST

1. హైదరాబాద్‌కు దిల్లీ సీఎం.. కేసీఆర్‌తో భేటీ కానున్న కేజ్రీవాల్ 

కేంద్రం ఆర్డినెన్స్‌పై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు విపక్ష నేతలను ఆయన కలిశారు. దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్‌ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను కేంద్ర ప్రభుత్వం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జూన్‌ 22 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం.. ఉత్సవాలకు రూ.15 కోట్లు: మంత్రి తలసాని

ఆషాడంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. జూన్‌ 22న గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు బేగంపేటలోని హరిత ప్లాజాలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారాసతో నీతులు చెప్పించుకునే స్థితిలో భాజపా లేదు: కిషన్‌రెడ్డి

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. భారాస ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటం బాధ్యతారాహిత్యమే అవుతుందని దుయ్యబట్టారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారం.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గంగిరెడ్డి విడుదల అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.  బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే..?

ఈ ఐపీఎల్‌ టోర్నీ ముగియగానే.. మరో మెగా సమరం క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. అదే ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌. ఆస్ట్రేలియాలోని ఓవల్‌ వేదికగా జరిగే ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్‌లు తలపడనున్నాయి. అయితే.. ఈ టోర్నీ ప్రైజ్‌మనీని ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్‌ డాలర్లు(రూ.13.22 కోట్లు) బహుమతిగా అందిస్తుండగా.. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.6.5 కోట్లు)ఇవ్వనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హాట్‌టాపిక్‌గా మారిన రాజదండం.. కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్‌షా

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ.. ‘రాజదండం’(Sengol) చర్చనీయాంశమైంది. అది కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారితీసింది. బ్రిటిషర్ల నుంచి భారత్‌కు బదిలీ అయిన అధికారాలకు ఈ రాజదండం ప్రతీక అని కేంద్రం చెప్తుండగా.. అందుకు లిఖితపూర్వకమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. తాజాగా దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాహుల్‌ గాంధీకి ఊరట.. పాస్‌పోర్టు జారీకి కోర్టు ఓకే..

మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi).. కొత్త పాస్‌పోర్టు విషయంలో ఊరట లభించింది. ‘సాధారణ పాస్‌పోర్టు (ordinary passport)’ కోసం నిరభ్యంతర పత్రం కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను దిల్లీ కోర్టు అంగీకరించింది. మూడేళ్ల కాలానికి గానూ ఆయనకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (NOC) జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పార్లమెంటు ప్రారంభోత్సవంపై వ్యాజ్యం.. విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ!

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవంపై (New Parliament Building) ప్రభుత్వం, విపక్షాల మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నూతన భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) నిరాకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనాలో మళ్లీ కొవిడ్‌ పంజా.. జూన్‌ నాటికి వారానికి 6.5కోట్ల కేసులు..!

కరోనా వైరస్‌ (Corona Virus) పుట్టినిల్లు చైనా (China)లో మరోసారి మహమ్మారి కోరలు చాచుతోంది. కొవిడ్ కొత్త వేవ్‌ (Covid New Wave) కారణంగా గత కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జూన్‌ చివరి నాటికి ఈ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరి వారానికి 6.5కోట్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు డ్రాగన్‌ దేశంలో కరోనా ఉద్ధృతిపై అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గాల్లోనే తెరచుకున్న విమానం డోర్‌.. వణికిపోయిన ప్రయాణికులు!

దక్షిణ కొరియాకు చెందిన ఓ విమానానికి (South Korean flight) భారీ ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే అందులోని ఓ వ్యక్తి అత్యవసర ద్వారాన్ని (Emergency Exit Door) తెరవడం తీవ్ర కలకలం రేపింది. క్యాబిన్‌లోకి భారీగా గాలులు వీయడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాలులతో కొందరికి శ్వాసకోశ సమస్యలు తలెత్తగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని