Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 05 May 2023 16:59 IST

1. సీబీఐ కోర్టులో లొంగిపోయిన A1 ఎర్ర గంగిరెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. జూన్‌ 2వ తేదీ వరకు న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. దీంతో ఎర్ర గంగిరెడ్డిని కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు సీబీఐ అధికారులు తరలించనున్నారు. ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్ల కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని సీబీఐ గతంలో ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. సాయంత్రంలోపు రైతులకు జగన్‌ సమాధానం చెప్పాలి: చంద్రబాబు

అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 40-50 శాతం పంట కల్లాలు, చేల్లోనే ఉందన్నారు. రైతులను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. కౌలు రౌతుల పరిస్థితేంటని సీఎం జగన్‌ను ఆయన ప్రశ్నించారు. కోనసీమ జిల్లా వేగాయమ్మపేటలో పాడైన పంటలను చంద్రబాబు పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అందుకే ఈ రెండు పథకాలకు ‘చదువు’ నిబంధన: సీఎం జగన్‌

పేదరికం పోవాలంటే చదువు అనే ఓ దివ్యాస్త్రం అందరికీ అందుబాటులోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలోని పేదల పిల్లలు బాగా చదువుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిధులను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం బటన్‌ నొక్కి విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు.. మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ

రాజధాని అమరావతి ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించాలంటూ రైతులు వేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఈసారి ఐపీఎల్‌ విజేత ఎవరో రవిశాస్త్రి చెప్పేశాడు..!

ఐపీఎల్‌ మ్యాచ్‌లు సగానికిపైగా పూర్తయ్యాయి. ఒక్కో టీమ్‌ దాదాపు తొమ్మిది, పది మ్యాచ్‌లు ఆడేశాయి. ఇక పాయింట్ల పట్టికలో పోటీ తీవ్రంగా ఉంది. తొలి నాలుగు స్థానాల్లో నిలవాలంటే విజయాలతోపాటు నెట్‌ రన్‌రేట్‌ కీలకంగా మారుతుందనే విషయం తెలిసిందే. అయితే.. ఈ సమయంలోనే టైటిల్‌ ఎవరు గెలుస్తారో మాజీ దిగ్గజ క్రికెటర్‌ రవిశాస్త్రి ముందుగానే అంచనా వేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. గూగుల్‌ నుంచి తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌.. ఎలా ఉందో చూశారా?

గూగుల్‌ నుంచి ఫోల్డబుల్‌ ఫోన్‌ రాబోతోందంటూ గతకొంత కాలంగా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలను అవి నిజమేనని గూగుల్‌ ధ్రువీకరించింది. పిక్సెల్‌ ఫోల్డ్‌ పేరిట మడతపెట్టే ఫోన్‌ను తీసుకురానున్నట్లు గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్‌ ఫోల్డ్‌ ఫోన్‌ ఎలా ఉండనుందో చూపిస్తూ ఓ వీడియో టీజర్‌ను గూగుల్‌ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మీరు జైల్లో ఉంటేనే బెటర్‌.. ‘ఆమ్రపాలి’ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

ఆమ్రపాలి గ్రూప్‌ నిధుల అవకతవకల కేసులో ఆ సంస్థ మాజీ సీఎండీ అనిల్‌ కుమార్‌ శర్మ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇళ్ల కొనుగోలుదారులను మోసగించిన ఆయనపై తాము సానుభూతి చూపించలేమని జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీతో సహా 68 మందికి ప్రమోషన్‌.. ‘సుప్రీం’లో సవాల్‌!

పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ (Congress) నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఇటీవల సూరత్‌ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి హరీశ్‌ హస్‌ముఖ్‌భాయి వర్మ (HH Varma) ఈ కేసును విచారించి.. రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలోనే ఇటీవల హెచ్‌హెచ్‌ వర్మతోపాటు మరో 68 న్యాయమూర్తులు జిల్లా జడ్జి కేడర్‌కు పదోన్నతి దక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బిహార్‌ ప్రభుత్వానికి ₹4వేల కోట్ల జరిమానా.. ఎందుకంటే..?

బిహార్‌ (Bihar) ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ NGT) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు గానూ రూ.4,000 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోపు జమ చేయాలని నీతీశ్ సర్కారును ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణలో బిహార్‌ ప్రభుత్వం అలసత్వంపై ఎన్‌జీటీ అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కోపం చల్లారాలంటే కోహ్లీ-గంభీర్‌ ఈ యాడ్‌లో నటించాలి : యువరాజ్‌ సూచన

విరాట్‌ కోహ్లీ (Virat Kohli), గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir )ల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదంపై చర్చ ఇప్పట్లో ముగిసేట్లు లేదు. ఈ అంశంపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూనే ఉన్నారు. లఖ్‌నవూ, బెంగళూరు మ్యాచ్‌ అనంతరం.. విరాట్‌, గంభీర్‌ కోపోద్రిక్తులై ఒకరిపై ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. వారిని ఇతర ఆటగాళ్లు విడదీసిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని