Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Jul 2023 09:14 IST

1. ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు మేరకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లకు నేడు ప్రత్యేక ప్రీ-ఓపెన్‌ సెషన్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్లకు నేడు (గురువారం) ప్రత్యేక ప్రీ- ఓపెన్‌ సెషన్‌ను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) నిర్వహించనుంది. ఇది ఉదయం  9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఆర్‌ఐఎల్‌ తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను (జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌-జేఎఫ్‌ఎస్‌ఎల్‌గా పేరు మారనుంది) విభజించి, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తుండటం ఇందుకు నేపథ్యం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాజపా నేత ఈటల రాజేందర్‌ గృహనిర్బంధం

భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈటలతో పాటు మరో భాజపా కీలక నేత డీకే అరుణను కూడా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి నేతృత్వంలో బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు వెళ్తామని భాజపా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జంట నగరాల్లో పలువురు భాజపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

కొత్త మిత్రులు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్ష కూటములు బలాన్ని కూడదీసుకుంటున్న తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరస్పరం ఇరుకునపెట్టే వ్యూహాలకు రెండు శిబిరాలూ పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మణిపుర్‌ అల్లర్లపై ప్రధాని నరేంద్రమోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడాలని విపక్షాలు భావిస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జనరల్‌ బోగీల వద్దకే జనాహారం.. రూ.20కి ఏడు పూరీలు

జనరల్‌ బోగీల్లోని ప్రయాణికులకు చేరువగా చౌక ధరలకే భోజనం, తాగునీటిని అందిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. సాధారణ బోగీలు ఆగే చోట కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు వాటిని అందుబాటులో ఉంచినట్లు బుధవారం రైల్వే అధికారులు వెల్లడించారు. తొలుత 51 చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, గురువారం నుంచి మరో 13 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘నాన్నా.. ఎందుకు రాజీనామా చేయడంలేదు?’

‘చేర్యాలలోని పెద్ద చెరువు స్థలాన్ని కబ్జా చేసినట్లు మా నాన్న యాదగిరిరెడ్డి అంగీకరించారు కదా.. ఇంకా ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి ప్రశ్నించారు. కుమార్తె భవానీరెడ్డి, అల్లుడు రాహుల్‌రెడ్డి తన అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఇటీవల ముత్తిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పునర్విభజన హామీలు నెరవేర్చాలని కోరాం

రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న అనంతరం బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సమావేశంలో పేర్కొన్నట్లు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏఐ యాంకర్‌తో ‘యువగళం’ వార్తలు

వార్తలు చదివే కృత్రిమ మేథ (ఏఐ) యాంకర్‌ను ఐ-టీడీపీ, కనిగిరి విభాగం రూపొందించింది. అంతేకాకుండా దానికి వైభవి అనే పేరునూ పెట్టింది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సమాచారాన్ని ఈ యాంకర్‌తో చదివించారు. ఈ మేరకు కనిగిరిలో పాదయాత్ర షెడ్యూల్‌ వివరాల్ని వైభవి వెల్లడిస్తున్న వీడియోను బుధవారం విడుదల చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘గురుకుల’ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9,120 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) షెడ్యూలులో గురుకుల నియామక బోర్డు స్వల్ప మార్పులు చేసింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు బదిలీ చేసింది. తొలుత ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంజినీరింగ్‌ బీ కేటగిరీ సీట్ల భర్తీకి నేడు నోటిఫికేషన్‌

రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల (30 శాతం) భర్తీకి గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఆయా కళాశాలలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి.. ప్రవేశాలను ఆగస్టు 31వ తేదీలోపు ముగించాలి. వాటి వివరాలను సెప్టెంబరు 15వ తేదీలోపు తమకు సమర్పించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు