Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 15 May 2023 21:03 IST

1. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్‌ ద్వారా సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి.. ఇవాళ సాయంత్రం పులివెందులకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. ఎలాగైనా మంగళవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ‘కీ’ విడుదల

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ (TS EAMCET 2023) ప్రాథమిక కీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వివిధ సెంటర్లలో నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షలు ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం రాత్రి 8గంటలకు EAMCET 2023 (ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌) పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 20 నిమిషాలకో ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. మిగతా బస్సులను విడతలవారీగా ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకొస్తారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్‌ హంగులతో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులకు ఈ-గరుడగా నామకరణం చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 135 మంది ఎమ్మెల్యేల మద్దతు నాకే..: డీకే శివకుమార్‌

కర్ణాటక (Karnatka) తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికవుతారనేది ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఈ పదవి విషయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar)ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ విషయమై చర్చలకు అధిష్ఠానం నుంచి పిలుపు రాగా.. సిద్ధరామయ్య ఇప్పటికే దిల్లీ (Delhi)కి చేరుకున్నారు. ఈ క్రమంలోనే డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చెత్త రికార్డు.. రోహిత్‌ను సమం చేసిన దినేశ్ కార్తిక్‌

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik)దారుణ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ (RR vs RCB)  మరోసారి విఫలమై నిరాశపరిచాడు. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో రెండో బంతికే డీకే వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే అంపైర్ తొలుత నాటౌట్‌గా ప్రకటించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రధాని అత్తగారినంటే.. అక్కడ ఎవరూ నమ్మలేదు: సుధామూర్తి

ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murty) సతీమణిగానే గాక.. రచయిత్రి, వితరణశీలిగా ఎంతో మందికి సుపరిచితురాలు సుధామూర్తి (Sudha Murty). పైగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak)కు స్వయానా అత్తగారు కూడా..! అయినప్పటికీ నిరాడంబరతకు ఆమె మారుపేరు. కోట్లాది రూపాయల డబ్బు, పలుకుబడి ఉన్నా.. ఆమె కట్టుబొట్టూ చూస్తే సాధారణ మధ్యతరగతి గృహిణిలాగే ఉంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కర్ణాటకలో కాంగ్రెస్‌.. ఆ హామీల అమలుకు రూ.62వేల కోట్లు..?

కర్ణాటకలో (Karnataka) అధికారంలో ఉన్న భాజపాను ఓడించి కాంగ్రెస్‌ (Congress) పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ విజయానికి అనేక అంశాలు దోహదం చేసినప్పటికీ.. మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు ఉచిత పథకాలు (Congress 5 Guarantees) మాత్రం సానుకూల ప్రభావం చూపించినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు ‘గ్యారంటీలు’ అమలు చేస్తే కనుక.. ఏడాదికి సుమారు రూ.62వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పోస్టర్లు, బ్యానర్లు లేకుండానే ఎన్నికలకు వెళ్తా: గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు చేసిన సేవ ఆధారంగానే తాను ఓట్లు గెల్చుకుంటానని కేంద్రమంత్రి (Union Minister), భాజపా (BJP) నేత నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నుంచి తాను ఎటువంటి పోస్టర్లు, బ్యానర్లు పెట్టబోనని చెప్పారు. రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పదేళ్లు జైల్లో ఉంచేందుకు ‘పాక్‌ ఆర్మీ’ పన్నాగం!

పాకిస్థాన్‌ సైన్యంపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం పేరుతో తనను పదేళ్ల పాటు జైల్లో ఉంచేందుకు సైన్యం (Pakistan Army) కుట్ర పన్నిందని ఆరోపించారు. లండన్‌ పన్నాగం బహిర్గతమైందన్న ఖాన్‌.. తన చివరి రక్తం బొట్టు వరకు వంచకులకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. వివిధ కేసుల్లో బెయిలు కోసం లాహోర్‌ హైకోర్టు ముందు ఇమ్రాన్‌ హాజరుకానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇద్దరు కీలక రష్యా కమాండర్ల మృతి..!

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇద్దరు కీలక కమాండర్లను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దొనెట్స్క్‌లో జరిగిన పోరాటంలో కర్నల్‌ వ్యాచెస్లావ్‌ మకరోవ్‌, కర్నల్‌ యెవ్జెనీ బ్రోవ్కో చనిపోయినట్లు పేర్కొంది. వీరు ఎక్కడ చనిపోయారు, మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వీరిలో మకరోవ్‌ రష్యాకు చెందిన 4వ మోటరైజ్డ్ రైఫిల్‌ బ్రిగేడ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని