Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 22 Jun 2023 21:13 IST

1. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అంటూ ఉద్యమం నడిపా: కేసీఆర్‌

ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగినా ధైర్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించి తీరామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరులకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వినూత్నంగా నిర్మించిన తెలంగాణ అమర వీరుల స్మారకం,  అమర జ్యోతిని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌.. కట్టింగ్ ఫిట్టింగ్‌ మాస్టర్‌: నారా లోకేశ్‌

పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్లే ఇచ్చి డబ్బులు కాజేస్తున్నారని జగన్‌ సర్కార్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. జగన్‌ ఒక కట్టింగ్‌, ఫిట్టింగ్‌ మాస్టర్‌ అంటూ విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆయన మాట్లాడారు. జగన్‌ వద్ద రెండు బటన్లు ఉన్నాయన్నారు. బల్లపైన గ్రీన్‌ బటన్‌ నొక్కితే ఖాతాలో రూ.10 జమ అవుతుందని.. బల్ల కింద ఎర్ర బటన్‌ నొక్కితే ఖాతాల్లోంచి రూ.100 ఖాళీ అవుతుందని లోకేశ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం: మోదీ

అమెరికాలో తనకు దక్కిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు, 4 మిలియన్ల భారతీయ అమెరికన్లకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ దంపతులు ఘనస్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విపక్షాల కీలక భేటీకి మాయావతి, కేజ్రీవాల్‌ ఝలక్‌

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా (BJP) నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేసేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్న తరుణంలో.. యూపీ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి తాను హాజరుకావడం లేదంటూ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మునిగిపోయిన టైటానిక్‌ దగ్గరకు 33 సార్లు వెళ్లిన జేమ్స్‌ కామెరూన్‌

జేమ్స్‌ కామెరూన్‌ పరిచయం అక్కర్లేని పేరు. ‘అవతార్‌’, ‘అవతార్2’ సహా ఎన్నో భారీ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఆయన తీసిన చిత్రాల్లో ‘టైటానిక్‌’ ఎవర్‌గ్రీన్‌. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఓడ ప్రమాదానికి గురై ఎలా సముద్రగర్భంలో కలిసిపోయిందో భావోద్వేగభరితంగా చూపించారు. సాహసాలంటే ఇష్టపడే కామెరూన్‌ సముద్రంలో మునిగిపోయిన ‘టైటానిక్‌’ షిప్‌ ప్రాంతాన్ని ఇప్పటివరకూ 33సార్లు సందర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చాట్‌జీపీటీ యూజర్ల డేటా లీక్‌.. డార్క్‌వెబ్‌లో అమ్మకానికి!

చాట్‌జీపీటీ రాకతో కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌లను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. యూజర్లు అడిగే ప్రశ్నలకు ఈ ఏఐ చాట్‌బాట్‌లు కచ్చితమైన సమాధానాలు ఇస్తుండటంతో ఎక్కువ మంది వీటి వినియోగానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా ఏఐ చాట్‌బాట్‌లతో కొందరు యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా రెప్లికా (ప్రతిరూపం)లను రూపొందించుకుని వాటితో సంభాషణలు సాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమూల్‌ బేబీ ఏడుస్తోంది.. మళ్లీ రావా డాచున్హా..!‘

అమూల్‌’.. ఈ పేరు చెప్పగానే ఓ చిన్న పాపాయి కార్టూన్‌ గుర్తుకు వస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ‘అమూల్‌ గర్ల్‌’ రూపకర్త డాచున్హా కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌ సిల్వెస్టర్‌ డాచున్హా మంగళవారం కన్నుమూశారు. దీంతో ఆయన కార్టూన్లకు ఫిదా అయిన చాలా మంది సామాజిక మాధ్యమాల్లో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘అమూల్‌ బేబీ ఏడుస్తోంది.. మళ్లీ రావా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆనంద్‌ vs ఆనంద్‌: ఆటలో గెలుపెవరిదంటే..?

ఒకరేమో ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామిక వేత్త, చదరంగం అంటే ఎంతో ఆసక్తి ఉన్న వ్యక్తి. ఇంకొకరు చదరంగంలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌. అలాంటి వారు చదరంగంలో తలపడితే.. ఆట ఎంత ఉత్కంఠగా సాగుతుందో చెప్పాల్సిన అవసరంలేదు. అలానే.. ఆట చూసే వారికి ఎవరు గెలుస్తారనే కుతూహలం కలగకమానదు. ఈ ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది టెక్‌ మహీంద్రా గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ 2023. ఆ ఇద్దరు ప్రముఖులు.. పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా , గ్రాండ్ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్‌ చేరువ..!

భారత అంతరిక్ష రంగం (Indian Space Industry)లో కీలక పరిణామం. ఇప్పటివరకు భారతీయ వ్యోమగామి (Indian Astronaut) అడుగుపెట్టని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మనకు చేరువకానుంది. 2024లో ఐఎస్‌ఎస్‌కు ఉమ్మడి మిషన్‌ (Joint Mission)ను భారత్- అమెరికాలు ప్రకటించనున్నట్లు వైట్‌హౌస్‌ (White House) వెల్లడించింది. నాసా (NASA), ఇస్రో (ISRO)ల నడుమ ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రపంచవ్యాప్తంగా 50 బెస్ట్‌ రెస్టారంట్‌లు.. భారతీయ రుచులకూ చోటు!

భారతీయ వంటకాల (Indian Cuisine)కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఆయా దేశాల్లో మన రెస్టారంట్లకు ఆదరణ ఎక్కువే! ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచవ్యాప్తంగా 50 అత్యుత్తమ రెస్టారంట్ల జాబితా- 2023’లో భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందిన రెండింటికి చోటుదక్కడం విశేషం. ఎస్‌.పెల్లెగ్రినో, ఆక్వా పన్నాలు స్పాన్సర్ చేసిన ఈ జాబితాను.. పాకరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని