Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 29 May 2023 21:01 IST

1. ‘డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌’తో బురిడీ.. ఐటీ అధికారుల ముసుగు దొంగల చోరీ కేసులో కీలక విషయాలు

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని బంగారం దుకాణంలో ఐటీ అధికారుల ముసుగులో చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జాకీర్‌, రహీమ్‌, ప్రవీణ్‌, అక్షయ్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. చోరీ చేసిన తర్వాత నిందితులు మహారాష్ట్రకు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు

లింగనిర్ధరణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై సీపీ రంగనాథ్‌ వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి 18 సెల్‌ఫోన్లు, రూ.73వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున లింగనిర్ధరణ పరీక్షల దందా సాగుతోందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే.. 150 స్థానాలు గెలుస్తామన్న రాహుల్‌ గాంధీ!

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో 150 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆయన మధ్యప్రదేశ్‌ రాష్ట్ర నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ పి. అగర్వాల్‌ సహా ఆ రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్‌ఆద్మీకి కాంగ్రెస్‌ మద్దతిచ్చేనా?

దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఆమ్‌ఆద్మీ పార్టీకి మద్దతివ్వాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు దిల్లీ, పంజాబ్‌ కాంగ్రెస్‌ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక భేటీ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్

ఈ ఐపీఎల్‌ (IPL 2023) సీజన్లో తన భీకర ఫామ్‌తో రాజస్థాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) అందరి దృష్టినీ ఆకర్షించాడు. అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించి రికార్డు సృష్టించాడు. మొత్తం 14 మ్యాచుల్లో 635 పరుగులు సాధించాడు. అందులో ఓ శతకం కూడా ఉంది. కోల్‌కతాపై 47 బంతుల్లో 98 పరుగుల వీర విధ్వంసంతో మరుపురాని ఇన్నింగ్స్‌ను ఆడాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఎయిరిండియాలో నియామకాలు కొనసాగుతాయ్‌: సీఈవో

ఎయిరిండియా (Air India) ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళికకు మార్కెట్‌ ట్రెండ్ మంచి ఆరంభాన్ని ఇచ్చిందని కంపెనీ ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ (Campbell Wilson) అన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా 550 మంది క్యాబిన్‌ సిబ్బంది, 50 మంది పైలట్ల నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. మున్ముందూ ఈ ధోరణి కొనసాగుతుందన్నారు. గతేడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియా సంస్థను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. డౌన్‌లోడ్‌కు BGMI రెడీ.. ఆడేందుకు ఇకపై టైమ్‌ లిమిట్‌

ప్రముఖ మల్టీ ప్లేయర్‌ షూటింగ్‌ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆండ్రాయిడ్‌ (Android), ఐఓఎస్‌ (iOS) స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్ల నుంచి ఈ గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దాదాపు ఏడాది తర్వాత గేమింగ్‌ లవర్స్‌కి అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్‌లో.. సదరు గేమింగ్‌ సంస్థ క్రాఫ్టన్‌ కొన్ని మార్పుల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. వీసాల్లో మార్పులు.. అండర్‌ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి

విదేశీ విద్యార్థితో పాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న వీసా విధానానికి బ్రిటన్‌ (Britain) ఇటీవల స్వస్తి పలకడంతో భారత్‌ నుంచి యూకే వెళ్లే విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై యూకే విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి తారిఖ్‌ అహ్మద్‌ (Tariq Ahmad) స్పందించారు. వీసా నిబంధనల్లో (Visa Rules) మార్పులు కేవలం పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థులకేనని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఎల్జీ సర్‌.. దిల్లీలో శాంతిభద్రతల బాధ్యత మీదే.. ఏదైనా చేయండి! : కేజ్రీవాల్‌

దేశ రాజధానిలో (Delhi Murder) తాజాగా జరిగిన బాలిక హత్యోదంతం తీవ్ర కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే 16ఏళ్ల బాలికను ఓ యువకుడు అనేకసార్లు పొడిచి చంపడం ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు (Arvind Kejriwal) ఇతర ప్రముఖులు కూడా స్పందించారు. ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (Lt Governor) వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్‌ పటేల్‌

దేశ చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం.. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడుగడుగునా ప్రతిబింబిస్తోంది. మరి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ నూతన భవనాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసా..? ప్రముఖ ఆర్కిటెక్ట్‌ బిమల్‌ హస్ముఖ్‌ పటేల్‌. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని